MP Putta Mahesh Kumar Yadav: క్లీన్ ఇమేజ్‌ కోసం పక్కా ప్లాన్..! ఎంపీ పుట్టా మహేశ్‌ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా?

రాజకీయంలో మౌనం కంటే..మాట కంటే..టైమింగే చాలా ముఖ్యమని పుట్టా మహేష్‌ ప్రూవ్‌ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. పక్కా ప్లాన్‌తో బిగ్‌ సౌండ్ చేస్తూ నియోజకవర్గంలో అడుగు పెట్టారని అంటున్నారు.

  • Updated on- April 25, 2026 / 10:00 PM IST
  • బౌన్స్‌ బ్యాక్ కోసం ఎంపీ మహేశ్‌ కొత్త స్ట్రాటజీ
  • డ్రగ్స్ కేసు తర్వాత భారీ ర్యాలీతో ఏలూరులోకి ఎంట్రీ
  • తప్పు చేయలేదంటూ..రయ్‌రయ్‌మని దూసుకెళ్లే స్కెచ్
  • పనితీరుతోనే ఇమేజ్‌ను బిల్డ్ చేసుకునే వ్యూహం..!

MP Putta Mahesh Kumar Yadav: పాలిటిక్స్ అంటే ఈక్వేషన్స్. సిచ్యువేషన్. రాజకీయ నాయకులకు ఏ రూపంలో చిక్కులు వచ్చి పడతాయో..ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పలేం. అలాంటి పరిస్థితినే ఫేస్‌ చేసిన ఎంపీ పుట్టా మహేశ్‌..క్లీన్ ఇమేజ్‌ కోసం సరికొత్త పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారట. డ్రగ్స్ అలిగేషన్ తర్వాత..భారీ ర్యాలీతో ఏలూరులోకి ఎంట్రీ ఇచ్చిన ఎంపీ..తాను ఏ తప్పూ చేయలేదంటూ ప్రజలకు ఇండికేషన్ పంపించి చర్చకు దారితీశారు. ఎంపీ పుట్టా మహేశ్‌ బౌన్స్ బ్యాక్ అయ్యేనా? పనితీరుతోనే..తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టాలనుకుంటున్నారా?

డ్రగ్స్ ఆరోపణల డ్యామేజ్‌ను కంట్రోల్ చేస్తూ క్లీన్ ఇమేజ్ కోసం ఎంపీ పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారా? నియోజకవర్గంలోకి భారీ ర్యాలీతో ఎంట్రీ ఇచ్చి తన బలం తగ్గలేదని ప్రత్యర్థులకు సంకేతాలు పంపారా? ఏ తప్పూ చేయలేదని ఆయన చెబుతున్న మాటలను జనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ సింపతీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది..ఏలూరు పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. రయ్‌రయ్ మంటూ దూసుకెళ్లే ప్లాన్ చేస్తున్న ఎంపీకి క్షేత్రస్థాయి నేతల సహకారం ఎలా ఉంది? క్యాడర్ ఉత్సాహంగా ఉన్నా, సీనియర్ నేతలు మనస్ఫూర్తిగా తోడుంటారా..లేకపోతే ఇదే సందు అని హ్యాండ్ ఇస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది.

డ్రగ్స్‌ మరకలు పోగొట్టుకునేలా దూకుడు..

మామూలుగానే ఎంపీ మహేశ్‌ ఏలూరు ప్రజలకు అందుబాటులో ఉంటారన్న టాక్ ఉంది. అభివృద్ధి, సంక్షేమం అంటూ ఎప్పుడూ ఏదో యాక్టివిటీ చేస్తుంటారు. అయితే ఇప్పుడు తన మీదున్న నెగిటివిటీని డైవర్ట్ చేసేలా ఇంకా దూకుడు పెంచారన్న టాక్ నడుస్తోంది. ఆరోపణలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గితే తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందని భావించి, మునుపటి కంటే రెట్టింపు వేగంతో ప్రజల్లోకి వెళ్లడమే ఆయన వ్యూహమన్న చర్చ జరుగుతోంది. మొన్నటి దాకా డ్రగ్స్ ఆరోపణల సెగతో సైలెంట్‌గా ఉన్న ఎంపీ, ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మార్చినట్లు కనిపిస్తున్నారు. భారీ ర్యాలీలు..సుడిగాలి పర్యటనలు..పార్టీ మీటింగ్‌లతో మహేశ్‌ లవ్స్ ఏలూరు అని ఇండికేషన్ పంపిస్తున్నారట. ఈ స్పీడుతోనే డ్రగ్స్‌ మరకలు పోగొట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

రాజకీయంలో మౌనం కంటే..మాట కంటే..టైమింగే చాలా ముఖ్యమని పుట్టా మహేష్‌ ప్రూవ్‌ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. పక్కా ప్లాన్‌తో బిగ్‌ సౌండ్ చేస్తూ నియోజకవర్గంలో అడుగు పెట్టారని అంటున్నారు. నేను నిప్పు..విచారణలో తేలుతుంది అంటూ సింపతీ అస్త్రం వదిలి ప్రజల్లోకి చర్చకు తెరలేపారు. ప్రొఫెషనల్ ప్లానింగ్‌తో దూసుకుపోతున్న ఎంపీ..విచారణ రిపోర్ట్ రాకముందే ప్రజాకోర్టులో ‘క్లీన్’ ఇమేజ్‌ తెచ్చుకునేందుకు వేస్తున్న అడుగులు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఎంపీ మాటల్లోని ధీమా జనాన్ని ఆలోచనలో పడేసిందంటున్నారు.

నియోజవర్గంలో అడుగుపెట్టిన తర్వాత అభిమానులు, నేతలు, కార్యకర్తలు ఆయనకు మద్దతు తెలపడం చూస్తుంటే..డ్రగ్స్‌ ఆరోపణలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది టీడీపీ శ్రేణుల మాట. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధులు కూడా ఎంపీకి తమ మద్దతు తెలుపుతూ మీ వెంటే మేమనే సంకేతాలివ్వడం ఆయనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయట. తనపై పడ్డ మరకను చెరిపేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? విచారణలో క్లీన్ చిట్‌ వచ్చేలోపే..తాను మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటారా అనేది చూడాలి.

Also Read: జనసేన ఎమ్మెల్యేపై బొలిశెట్టికి అవినీతి సెగ..! తెరవెనుక కుట్రలు చేస్తున్నదెవరు?