Kuppam Politics (Photo : Google)
Peddireddy Vs Srikanth Kancharla : చిత్తూరు జిల్లా కుప్పంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం టీడీపీ ఇంఛార్జి కంచర్ల శ్రీకాంత్ మాటల యుద్ధానికి దిగారు. నువ్వు అద్దె నాయకుడు అని మంత్రి పెద్దిరెడ్డి విమర్శిస్తే.. అద్దె నాయకుడు నువ్వా? నేనా? అంటూ మంత్రిపై ఫైర్ అయ్యారు కంచర్ల శ్రీకాంత్.
”అద్దె నాయకుడితో కుప్పంలో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. కుప్పంలో టీడీపీకి నాయకులు ఎవరూ లేరు. అంతా ఇంటికే పరిమితమయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాంత్ అనే అద్దె నాయకుడిని ఇక్కడికి తెచ్చుకున్నారు. అతనికి కుప్పంలో ఒక్క వార్డు గెలిపించే సత్తా ఉందా?” అని కంచర్ల శ్రీకాంత్ ను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు చేశారు.
మంత్రి చేసిన విమర్శలకు కుప్పం టీడీపీ ఇంఛార్జి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. కుప్పంకు అద్దె నాయకుడు నువ్వా..? నేనా..? అని మంత్రిని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గం పుంగునూరును వదిలి తరచూ కుప్పం వస్తున్నారు. తూర్పు రాయలసీమ శాసనమండలి స్థానం పరిధిలోని కుప్పంలో 4వేల మంది గ్రాడ్యుయేట్లు నాకు ఓటు వేశారు. కుప్పం ఓటర్లు నాకు ఓటు వేశారే తప్ప, మీకు ఓటు వేయలేదు.
నేను 36 నియోజకవర్గ గ్రాడ్యుయేట్లు ఎన్నుకున్న ఎమ్మెల్సీని. ఇందులోని కుప్పం నియోజకవర్గాన్ని ప్రోటోకాల్ గా ఎంచుకునే హక్కు రాజ్యాంగబద్ధంగా ఉందన్న విషయం కూడా మంత్రికి తెలియదా..? కుప్పం మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న నన్ను అద్దె నాయకుడు అనడం హాస్యాస్పదం.
బీసీలపై ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ భరత్ ను ఇప్పుడే మంత్రిని చేయండి. పుంగనూరు శాసన సభ్యులుగా గెలిచి పుంగనూరు కన్నా కుప్పంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారంటే ఇక్కడున్న ఇంఛార్జి, ఎమ్మెల్సీ భరత్ కు చేతకాదా? నాయకత్వ లక్షణాలు లేవా…? అని మంత్రి పెద్దిరెడ్డిని నిలదీశారు కంచర్ల శ్రీకాంత్.