కరోనాతో ఏపీలో 77.04 శాతం చనిపోయింది వాళ్లే.. బయటకు రావద్దు..
- vamsi
- Published On : June 11, 2020 / 01:58 AM IST
కరోనా వైరస్ కారణంగా ప్రమాదంలో ఉన్నది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇప్పటివరకు 78 మంది చనిపోగా.. వారిలో 77.04 శాతం మంది రక్తపోటు(బీపీ), మధుమేహం, ఆస్తమా, గుండె, కిడ్నీ, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారని చెబుతున్నారు అధికారులు. అంతేకాకుండా వీరిలో 48 శాతం మంది 60 నుంచి 69 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారే.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5247 మందికి కరోనా వైరస్ సోకగా.. వీరిలో 1,573 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ అయ్యి ఇళ్లకు వెళ్లే వారి శాతం 57.09గా ఉంది. మరణిస్తున్నవారి శాతం 1.61గా ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ 48.88 శాతం కాగా.. మరణాలు 2.80 శాతంగా ఉంది.
లాక్డౌన్ నిబంధనల సడలింపులతో పాజిటివ్ కేసులు పెరిగిపోతుండగా.. వైరస్ బారిన పడడాన్ని తగ్గించగలిగితే మృతుల సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా 60ఏళ్లు పైన వయసు కలిగిన వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని సూచనలు చేస్తున్నారు. వైరస్ బారినపడిన వారిలో కోలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా 60ఏళ్ల పైన ఉండి రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులతో బాధపడేవారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండడమే మంచిది అని చెబుతుంది కేంద్ర ఆరోగ్యశాఖ.
