YCP Leader Murder Case: హిందూపురం వైసీపీ నేత దారుణ హత్య.. ఎమ్మెల్సీ పీఏతో సహా ఐదుగురిపై కేసు నమోదు
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వైసీపీ నేత చౌళూరు రామకృష్ణారెడ్డి (46) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి హత్యచేశారు. రామకృష్ణారెడ్డి తల్లి ఫిర్యాదుతో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Harishth Thanniru
- Updated on- October 9, 2022 / 12:10 PM IST
YCP Leader murdered
YCP Leader Murder Case: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వైసీపీ నేత చౌళూరు రామకృష్ణారెడ్డి (46) దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి కర్ణాటక సరిహద్దులో తాను నిర్వహిస్తున్న దాబా మూసివేసి కారులో ఇంటికి వచ్చాడు. కారు దిగుతుండగా దుండగులు రామకృష్ణారెడ్డిపై వేట కొడవళ్లతో దాడి చేశారు. తీవ్రగాయాలతో పడిఉన్న రామకృష్ణారెడ్డిని స్థానికులు కారులో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే రామకృష్ణారెడ్డి మరణించినట్లు వైద్యులు తెలిపారు.
రామకృష్ణారెడ్డి మృతితో హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హిందపురం ప్రభుత్వాస్పత్రి వద్దకు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలింవచ్చారు. రామకృష్ణారెడ్డి మృతదేహంతో మద్దతుదారుల, వైసీపీ కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నేతలకే దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆందోళనకారులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ హత్యకు కారణమైన నిందితులపై కేసులు నమోదుచేసి కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఎమ్మెల్సీ ఇక్బాల్పై రామకృష్ణారెడ్డి మద్దతుదారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
రామకృష్ణారెడ్డి తల్లి ఫిర్యాదుతో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణ, రవి, వరుణ్, మురళి, నాగన్న ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చౌలూరు గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
