Chandrababu Naidu : ఆరుద్రకు వెంటనే రక్షణ కల్పించండి- ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
Chandrababu Naidu : విచారణ జరిపి ఆరుద్రను వేధించిన వారికి శిక్షపడేలా చేయాలి. ఆమె బిడ్డకు తగిన వైద్యం అందించి ఆదుకోవాలి.
- Naveen
- Published On : July 16, 2023 / 10:41 PM IST
Chandrababu Naidu(Photo : Google)
Chandrababu Naidu – Arudra : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. కాకినాడకు చెందిన ఆరుద్రకు రక్షణ కల్పించాలని డీజీపీని లేఖలో కోరారు చంద్రబాబు. తన బిడ్డ వైద్యం నిమిత్తం సొంత ఆస్తి అమ్ముకునే విషయంలో కొంతకాలంగా ఆరుద్ర పోరాటం చేస్తోంది. ఆరుద్రను వేధిస్తున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు చంద్రబాబు.
లేఖలోని అంశాలు..
ఆరుద్ర కుమార్తె సాయి లక్ష్మి చందన వెన్నెముక సమస్య కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. బిడ్డ వైద్యం కోసం శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఉన్న తన ఇంటిని ఆరుద్ర రూ.40 లక్షలకు విక్రయించాలని చూశారు. అయితే మంత్రి దాడిశెట్టి రాజా వద్ద గన్మెన్గా పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు శివ, కన్నయ్య ఆరుద్రను బెదిరించి ఇంటిని రూ.10 లక్షలకే అమ్మాలని ఒత్తిడి తెచ్చారు.
Also Read..YCP: వైసీపీలో వారసుల సందడి.. తలలు పట్టుకుంటున్న వైసీపీ పెద్దలు..!
వేధింపులపై ప్రభుత్వ స్పందన కార్యక్రమంతో పాటు అనేక చోట్ల ఆమె ఫిర్యాదు చేసినా ఫలితం లభించలేదు. దీంతో సీఎంకు ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి వెళ్లిన ఆరుద్రను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో 2022 నవంబర్ లో సీఎం క్యాంప్ కార్యాలయం వద్దనే ఆరుద్ర ఆత్మహత్యకు యత్నించారు. తనకు న్యాయం చేయాలని కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆరుద్ర నిరసన దీక్షకు దిగితే పోలీసులు అడ్డుకుని ఆరుద్ర, ఆమె కుమార్తెను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
ఆరుద్ర మానసిక స్థితి సరిగా లేదని చికిత్స నిమిత్తం విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ప్రభుత్వ అధికారులు సహకరించకపోగా మరింతగా వేధింపులకు గురిచేశారు. విచారణ జరిపి ఆరుద్రను వేధించిన వారికి శిక్షపడేలా చేయాలి. ఆమె బిడ్డకు తగిన వైద్యం అందించి ఆదుకోవాలి” అని డీజీపీని కోరారు చంద్రబాబు.
