×
Ad

బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు, అడ్డంగా దొరికిపోయిన అభ్యర్థి

ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు డబ్బులు పంచుతారు, మరికొందరు విలువైన కానుకలు ఇస్తారు. ఆ అభ్యర్థి ఏకంగా బంగారు ముక్కు పుడకలు ఓటర్లకు ఆఫర్ చేశాడు. బిర్యానీ ప్యాకెట్లలో ఉంచి వాటిని ఓటర్లకు పంచబోయి అడ్డంగా దొరికిపోయాడు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఘటన జరిగింది.

  • Published On : March 10, 2021 / 11:16 AM IST

independent candidate giving gold ornaments biryani packets: ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు డబ్బులు పంచుతారు, మరికొందరు విలువైన కానుకలు ఇస్తారు. ఆ అభ్యర్థి ఏకంగా బంగారు ముక్కు పుడకలు ఓటర్లకు ఆఫర్ చేశాడు. బిర్యానీ ప్యాకెట్లలో ఉంచి వాటిని ఓటర్లకు పంచబోయి అడ్డంగా దొరికిపోయాడు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఘటన జరిగింది.

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఓ అభ్యర్థి ఓటర్లకు గాలం వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఖండే శ్యాంసుందర్‌లాల్‌ బరిలో ఉన్నాడు. డబ్బు, బంగారంతో ఓటర్లను మభ్యపెట్టాలని చూశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కర్నాటక నుంచి కిరాయికి కొందరు వ్యక్తులను పిలిపించాడు.

మంగళవారం(మార్చి 9,2021) బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు. పైకి బిర్యానీ పొట్లం మాదిరే ఉంటుంది. దీంతో ఎవరికీ అనుమానం రాదు. చాలా సులువుగా తన పని అయిపోతుందని అనుకున్నాడు.

అయితే, కథ అడ్డం తిరిగింది. సమాచారం పోలీసులకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు బిర్యాన్నీ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్రస్వామి, రవికిరణ్, మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు బైకులు, రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు పోలీసులు.