అందరూ చూస్తుండగానే క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి.. మూడో అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థి
ఆ విద్యార్థి పేరు చరణ్. నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు.
- T Venkateshwarlu
- Published On : January 23, 2025 / 05:32 PM IST
తరగతి గదిలో కూర్చుని పాఠాలు వింటున్న ఓ విద్యార్థి.. అందరూ చూస్తుండగానే బయటకు వెళ్లి మూడో అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని ఓ జూనియర్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ విద్యార్థి పేరు చరణ్. నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. రోజులాగే ఇవాళ కూడా కాలేజీకి వెళ్లాడు. అందరి పిల్లల్లాగే క్లాస్ రూమ్లో కూర్చున్నాడు. మనసులో ఏదో బాధపడినట్లు తెలుస్తోంది. క్షణికావేశంలో ఒక్కసారిగా లేచాడు. క్లాస్ రూమ్లో లెక్చరర్ ఉన్నప్పటికీ, ఆయన ముందు నుంచే చరణ్ బయటకు వెళ్లాడు.
చరణ్ మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా దూకిన విషయాన్ని తోటి విద్యార్థులు కిటికీ నుంచి చూశారు. చరణ్ ఒక్కసారిగా దూకేయడంతో అతడిని కాపాడే అవకాశం కూడా ఎవరికీ లేదు. మూడో అంతస్తు రేలింగ్ నుంచి అతడు కిందకు దూకేసిన దృశ్యాలు కాలేజీలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
చరణ్ తీవ్రంగా గాయపడడంతో, అతడిని ఆసుపత్రికి తరంచే ప్రయత్నం చేశారు. అయితే, చరణ్ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ విద్యార్థి ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడో తెలియరాలేదు. విద్యార్థి బలవన్మరణం గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగాయి. పోలీసులు అక్కడకు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి బలవన్మరణం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
