ప్రభుత్వ పథకాల విషయంలో క్లారిటీ మిస్సయ్యిందా? గ్రామసభల్లో గొడవలకు సమాచార లోపమే కారణమా?

ఓ వైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి.

తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఎన్నికల హామీ ప్రకారం..రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీని జనవరి 26 నుంచి అట్టహాసంగా ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన డబ్బులను అన్నదాతల అకౌంట్లలో జమ చేసింది.

అయితే రాష్ట్రవ్యాప్తంగా మండలానికో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని రైతు భరోసా సొమ్మును విడుదల చేశారు. ఎకరానికి 6 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల 41వేల 911 మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో 593 కోట్లు జమ చేశారు. ఇదే క్రమంలో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద దాదాపు రూ.10 కోట్లను కూడా లబ్ధిదారుల అకౌంట్లలో వేశారు.

అసలు సమస్య ఇక్కడే..
ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. జనవరి 26 నుంచి నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు ప్రకటించడంతో ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈనెల 27న కేవలం మండలానికి ఒక్క గ్రామానికి చెందిన లబ్ధిదారులుకు మాత్రమే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడంతో మిగతా వారు అయోమయంలో పడిపోయారు. తమకు ఎప్పుడు ఈ పథకాలను అందిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో దాదాపు 12 వేల గ్రామాలుంటే కేవలం 577 గ్రామాల్లోని రైతులకు మాత్రమే రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా డబ్బులు అందాయి. ఇంకా దాదాపు 11 వేల గ్రామాల్లోని 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా, 10 లక్షల మంది రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందాల్సి ఉంది. వారందరి బ్యాంకు అకౌంట్స్‌లో ఎప్పుడు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు జమ చేస్తారన్న దానిపై క్లారిటీ లేదట.

జయలలిత ఆస్తులపై కోర్టు సంచలన తీర్పు.. పోయెస్ గార్డెన్, 11,000 చీరలు.. అంతా ఎవరికంటే..

మార్చి 31 లోపు అర్హులందరికీ ఈ నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధి చేకూరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతుబంధును మూడు నాలుగు నెలల పాటు ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాము కూడా మార్చి 31 లోపు రైతులు, రైతు కూలీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తుమ్మల చెప్పుకొచ్చారు.

రైతు భరోసా కోసం అన్నదాతల ఎదురుచూపులు
ప్రభుత్వం ఈ విషయాన్ని ఈనెల 26న ఈ నాలుగు పథకాలను ప్రారంభించే కంటే ముందే చెప్పాల్సి ఉండిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనవరి 26 నుంచి నాలుగు పథకాలు అమలు చేస్తామని చెప్పడంతో.. రైతు భరోసా కోసం అన్నదాతలంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు.

తీరా ఈ నెల 27న కేవలం మండలానికి ఒక్క గ్రామానికి మాత్రమే రైతు భరోసా అమలు అవ్వడంతో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తర్వాత రోజైనా మిగతా వారికి రైతు భరోసా అందుతుందని భావించినా మళ్లీ నిరాశే ఎదురైంది. మిగతా వారికి ఇప్పుడే కాదు..మార్చి 31 వరకు దశలవారీగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

ఓ వైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే..మరోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఇలా మార్చి 31 వరకు దశలవారీగా ఈ పథకాలను అమలు చేస్తామని ముందే ప్రకటించి ఉంటే ఈ గందరగోళ పరిస్థితి వచ్చేది కాదన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ పథకాల అమలు విషయంలో రేవంత్ సర్కార్‌కు క్లారిటీ లేదా.? లేకపోతే పక్కా ప్రణాళిక రూపొందించలేదా.? సమన్వయ లోపమా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.