జగన్ అలర్ట్ : బీసీ నేతలతో భేటీ

  • Publish Date - January 28, 2019 / 09:38 AM IST

హైదరాబాద్: ఏపీలో బీసీ ఓట్లకు గాలం వేసేందుకు రాజకీయ పార్టీలు యత్నాలు మొదలెట్టాయి. తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం లో బీసీ జయహో సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం చంద్రబాబునాయుడు బీసీ లకు వరాల జల్లులు కురిపించిన విషయం తెలిసిందే.  దీంతో సోమవారం  వైసీపీ అధినేత జగన్ తన పార్టీకి చెందిన బీసీ నాయకులతో సమావేశం అయ్యి ఫిబ్రవరి 18న బీసీ గర్జన సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలో జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. 

ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు నాయుడు ఆదివారం నాటి జయహో బీసీ సభలో ప్రకటించారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆరోపించారు.  జగన్ తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలను అవమానపరిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. బీసీ కులాల స్థితిగతులను, జీవన ప్రమాణాలను తెలుసుకునేందుక ఏడాది క్రితం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి  ఏర్పాటు చేసిన బీసీ అధ్యయన కమిటీ నివేదికను  సోమవారం ఆయనకు ఇచ్చామని జంగా తెలిపారు.