Jagananna Vasathi Deevena : జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదాకు అసలు కారణమిదే..
Jagananna Vasathi Deevena : సంక్షేమ క్యాలెండర్ అమలుకు నిధుల ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు జవహర్ రెడ్డి. రెండు రోజుల్లో ఏపీ సమస్యలపై కేంద్రంతో మాట్లాడేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తారన్నారు జవహర్ రెడ్డి.
- Naveen
- Published On : April 18, 2023 / 09:13 PM IST
Jagananna Vasathi Deevena (Photo : Google)
Jagananna Vasathi Deevena : నిధుల్లేక వసతి దీవెన కార్యక్రమం వాయిదా వేసినట్లు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఆర్థిక శాఖ సూచనల మేరకు వసతి దీవెనను వాయిదా వేశామన్నారు. అయితే, సంక్షేమ క్యాలెండర్ అమలుకు నిధుల ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు జవహర్ రెడ్డి. రెండు రోజుల్లో ఏపీ సమస్యలపై కేంద్రంతో మాట్లాడేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తారన్నారు జవహర్ రెడ్డి.
‘కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది. వాటి కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాం. గత నెల 17న ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కలిసిన సీఎం జగన్ దీనిపై వినతిపత్రం ఇచ్చారు. వసతి దీవెన నిధుల విడుదలకు సరిపడ ఫండ్స్ లేవు. ఆ కారణంగానే వాయిదా వేయాల్సిందిగా ఆర్థికశాఖ సూచించింది. ఏపీ విభజన అంశాలు కొన్ని కొలిక్కి వచ్చాయి. కార్యదర్శుల కమిటీ రేపు (ఏప్రిల్ 19) ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించాం. ఢిల్లీ వచ్చేందుకే సీఎం జగన్ విదేశీ పర్యటన వాయిదా వేసుకున్నారు. కేంద్ర కార్యదర్శుల సమావేశంతో పాటు ఉన్నతస్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి సీఎం జగన్ అవసరం ఉంది’ అని సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ సోమవారం(ఏప్రిల్ 17) అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో పర్యటించాల్సి ఉంది. అక్కడ జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి సంబంధించిన సభలో పాల్గొని, లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేయాల్సి ఉంది. ఇంతలో సీఎం జగన్ పర్యటన వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 26న సీఎం జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తారని వెల్లడించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అన్ని వర్గాల వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇందులో ఒకటి జగనన్న వసతి దీవెన. ఈ స్కీమ్ కింద ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదివే విద్యార్థులకు రూ.20వేల వరకు వసతి, భోజన, రవాణ ఖర్చుల నిమిత్తం వారి తల్లుల ఖాతాల్లో నేరగా నగదు జమ చేస్తోంది ప్రభుత్వం.
వసతి దీవెన స్కీమ్ కి ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆపై చదువులు చదివిన విద్యార్థులు అర్హులు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యూనివర్సిటీలు, బోర్డుల్లో చదివే వారు అర్హులు. కాగా, విద్యార్థులకు కచ్చితంగా 75శాతం అటెండెన్స్ ఉండాలి.
