Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ లో ఉండే సంపద అంతా తనవద్దే ఉండాలని సీఎం జగన్ ఉద్దేశమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. కన్నాకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. అందరూ భానిస జీవితం గడపాలని జగన్ అనుకుంటున్నారని చెప్పారు.
జగన్ మరింత ధనవంతుడు అవుతూనే ఉన్నారని, ప్రజలు మాత్రం మరింత పేదరికంలో కూరుకుపోతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని పేదల ప్రాణాలను ఫణంగా పెట్టి అమ్ముతున్నారని చెప్పారు. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించాలంటే టీడీపీకే సాధ్యమని తెలిపారు. రివర్స్ టెండర్లతో పాలనను రివర్స్ చేశారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో జగన్ గూగుల్ టేక్ అవుట్లో అడ్డంగా దొరికారని చంద్రబాబు అన్నారు.
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం ఓ మంచి పరిణామమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో కన్నాకు తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చెప్పారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, పదేళ్ల పాటు మంత్రిగా సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన నిబద్ధతతో పనిచేస్తారని చెప్పారు. కాగా, ఇటీవలే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన అనుచరులతో కలిసి ఆయన ఇవాళ టీడీపీలో చేరారు.
Sri Krishnadevaraya University Homam: యూనివర్సిటీలో మహా మృత్యుంజయ హోమం రద్దు