×
Ad

Pawan Kalyan : జనసేన ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్, వందల కోట్లు పెట్టి నన్ను ఓడించటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు

దురదృష్టవశాత్తూ ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా.

  • Published On : March 19, 2024 / 07:23 PM IST

Kakinada Janasena MP Candidate

Pawan Kalyan : నేను చెబుతున్న కులాల ఐక్యత పిఠాపురంలో మొదలైంది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నా గెలుపు కోసం నేను పిఠాపురం నుంచి పోటీ చేయటం లేదని పవన్ చెప్పారు. గాజువాక, భీమవరంతో పాటు పిఠాపురం కూడా నాకు కన్నువంటిది అని అన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేయాలనే విజ్ఞప్తులు ఎక్కువగా వచ్చాయని పవన్ తెలిపారు.

నన్ను అసెంబ్లీకి పంపిస్తామనే హామీ చాలామంది ఇచ్చారని వెల్లడించారు. శ్రీపాద శ్రీవల్లభుడి ఆశీస్సులు తనపై ఉంటాయని భావిస్తున్నా అని పవన్ తెలిపారు. ఇకపై పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకుంటా, పిఠాపురం నుంచి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చేందుకు ప్రయత్నిస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గంలో పలువురు నాయకులు జనసేనలో చేరారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్.. అందరినీ పేరుపేరునా పరిచయం చేసుకున్నారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే దానిపై వివరణ ఇచ్చారు పవన్ కల్యాణ్.

”పిఠాపురాన్ని ఏపీలో ఆదర్శ నియోజకవర్గం చేద్దాం. ఇక్కడ విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా. ఎమ్మెల్యే తలుచుకుంటే అభివృద్ధి ఎలా చేయొచ్చో చూపిస్తా. ఎంతటి తీవ్రమైన సమస్యనైనా తగ్గించటానికి ప్రయత్నిస్తా. నేను సమాజాన్ని కలిపే వ్యక్తిని, విడదీసే వ్యక్తిని కాదు. మీ అందరి సహకారం, దీవెనలు కావాలి. వ్యవస్థపై కోపంతో ఎవరూ నోటాకు ఓటు వేయొద్దని కోరుతున్నా. అలాంటి వారు జనసేనకు ఓటు వేస్తే ఉపయోగపడుతుంది. వందల కోట్లు పెట్టి నన్ను ఓడించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులుంటే జగన్ లక్ష ఇచ్చినా ఏమీ కాదు.

2009లో వంగా గీత పీఆర్పీ నుంచే గెలిచారు. దురదృష్టవశాత్తూ ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా. కేంద్ర నాయకత్వం నన్ను రెండు అడిగింది. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా అని అడిగారు. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉందని చెప్పా. ముందు రాష్ట్రం, ఆ తర్వాత దేశానికి సేవ చేయాలని చెప్పా. నా కోసం త్యాగం చేసిన ఉదయ్ ను కాకినాడ ఎంపీగా పంపిస్తున్నా” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read : టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు.. 11 నియోజకవర్గాల అభ్యర్థులు వీరే?