kanipakam varasiddhi vinayaka : ప్రముఖ దేవాలయాల్లో మూల విరాట్టులను ఫోటోలు తీయకూడదనే నిబంధనలు ఉంటాయి. కానీ చిత్తూరు జిల్లాలో కొలువైన శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఒరిజనల్ ఫోటోలు ఫేస్ బుక్ లో కనిపించేసరికి భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘనకార్యం అంతా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ ఘనకార్యమేనని తెలుస్తోంది. మంగళవారం (ఏప్రిల్ 11,2023)న కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి కటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గర్భగుడి ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ క్రమంలో చైర్మన్ అనుచరులు ఏకంగా మూలవిరాట్ ఫోటోలను తీశారు. ఆ ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మూలవిరాట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో దేవాలయంలో భద్రత ఎంత వరకు ఉందో ఈ ఘటనద్వారా తెలుస్తోంది అంటూ భక్తులు మండిపడుతున్నారు. భక్తులను చెక్ చేసి లోపలికి పంపించే ఆలయ సిబ్బంది అదే పదవిలో ఉన్నవారిని పరిశీలించరా?వారు వారి అనుచరులు ఏం చేస్తున్నారో గమనించరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
సత్యప్రమాణాలకు నెలవైన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారు స్వయం భూగా ఓ బావిలో వెలసిన దివ్య క్షేత్రం కాణిపాకం. దేశంలోని వినాయకుడి ఆలయాల్లో కాణిపాకం ఆలయంకు ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ స్వామి వారు భక్తుల కోర్కెలను తీర్చే కొంగుబంగారమై అలరారుతున్న ఈ గణేషుడికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది.