supreme court
తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని చెప్పింది. రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారని పేర్కొంది. మతంతో రాజకీయాలను కలపకూడదని తెలిపింది. కల్తీ నెయ్యి వాడినట్లు ల్యాబ్ రిప్టోర్ ప్రాథమికంగా చూపలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తిరుపతి లడ్డూకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 20న చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు.. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఇప్పటికే విచారణకు ఆదేశించితే మరి మీడియా ముందుకు వెళ్లవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించింది.
ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది జులైలోనని, సీఎం ప్రకటన చేసింది సెప్టెంబర్లోనని చెప్పింది. అసలు రిపోర్టు స్పష్టంగా లేదని తెలపడం గమనార్హం. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారన్నడానికి ఆధారాలేంటి అని ప్రశ్నించింది. కాగా, ఎన్ని నెయ్యి ట్యాంకర్లను వాడారన్న వివరాలను సుప్రీంకోర్టుకు టీటీడీ న్యాయవాది తెలిపారు.