Kottu Satyanarayana
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాయడంపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ సర్కారు భారీ స్కాంకు పాల్పడిందంటూ పవన్ లేఖ రాయడం సరికాదన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ… చంద్రబాబు హయాంలో అన్నీ స్కాములే జరిగాయని ఆరోపించారు. ఈ స్కాముల్లో పవన్ కల్యాణ్కు కూడా వాటా ఉందా? అని ప్రశ్నించారు.
వైసీపీ పాలనలో ఇళ్ల స్థలాల్లో రూ.35 వేల కోట్ల స్కాం జరిగిందని అంటున్న పవన్.. ఇందుకు సంబంధించిన ఆధారాలు చుపిస్తారా అని ప్రశ్నించారు. ఒకవేళ మోదీ దీనిపై స్పందించి అన్ని కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని అడిగితే పవన్ తెల్లముఖం వేసుకుని చూస్తారంటూ ఎద్దేవా చేశారు.
సీబీఐ, ఈడీతో విచారణ జరపాలన్న పవన్ ఇంటర్పోల్తోనూ విచారణ జరిపించాలని అంటారేమో అంటూ చురకలంటించారు. దేశంలో ఎక్కడలేని విధంగా లక్షలాది మందికి జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు నాయుడికి పవన్ కల్యాణ్ ఊడిగం చేస్తున్నారని అన్నారు.
కాపులు తనకు ఓట్లు వేయలేదని అని పవన్ కల్యాణ్ అంటున్నారని, అసలు ఆయనకు ఓట్లు వేసిన ఇతర వర్గాల వారూ లేరని విమర్శించారు. రూ.35 వేల కోట్ల స్కామ్ అంటే తేలికైన విషయమని పవన్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
Tamilisai Soundararajan: ‘రాజీనామా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ’ ప్రచారంపై గవర్నర్ తమిళిసై స్పందన