టీడీపీకి షాక్: నామినేషన్ చెల్లదు.. బరిలోకి డమ్మీ అభ్యర్ధి

  • Publish Date - March 27, 2019 / 12:53 AM IST

ఏపీలో టీడీపీకి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌టీ రిజర్వుడు నియోజకవర్గం అయిన కురుపాంలో తెలుగుదేశం తరుపున నామినేషన్ వేసిన వీటీ జనార్దన్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్‌తో పాటు వీటీ జనార్దన్ ఇచ్చిన కులధ్రువీకరణ పత్రంపై బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈసీ అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో తెలుగుదేశం తరుపున డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన ప్రియా థాట్రాజ్ పేరును టీడీపీ ప్రకటించింది.
2013లో జారీ అయిన ఎస్టీ సర్టిఫికెట్‌ను ఎన్నికల సంఘం అధికారులు పరిగణనలోకి తీసుకోవడాన్ని బీజేపీ నేత నిమ్మక జయరాజ్ తప్పుబట్టారు. ఆయన ఎస్‌టీ కాదని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈసీకి చూపించారు. ఈ క్రమంలో జనార్దన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది.