Tirumala : తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు
- Harishth Thanniru
- Published On : September 29, 2024 / 07:58 AM IST
leopard In Tirumala
leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద చిరుతపులి సంచరించింది. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో చిరుత రావడంతో కుక్కలు అరుస్తూ వెంబడించాయి. చిరుతపులి వాటిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో కంట్రోల్ రూం వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు అప్రమత్తమయ్యాడు. కంట్రోల్ రూంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు. శ్రీనివాస మంగాపురం నుంచి శనివారం ఉదయం 5గంటలకు భక్తులను శ్రీవారి మెట్టుకు వదిలారు. అదే సమయంలో సెక్యూరిటీ గార్డు గది నుంచి బయటకు వచ్చి టీటీడీ సెక్యూరిటీ, అటవీశాఖ అధికారులకు చిరుత గురించి సమాచారం ఇచ్చాడు. తరువాత కాలినడక భక్తులను గుంపులు, గుంపులుగా వదులుతున్నారు.
Also Read : టీటీడీ బోర్డుకు బ్రేక్ ఎందుకు పడింది? సభ్యుల నియామకం ఆ తర్వాతేనా?
తిరుమలలో మరోసారి చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు చిరుత జాడను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. గతేడాది తిరుమలలో చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పట్లో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతలను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేయడంతోపాటు.. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆరు చిరుతలను బందించారు.
ఈ ఏడాది ఆగస్టు నెలలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఘాట్ రోడ్డు 56 మలుపు వద్ద వాహనదారులకు చిరుతపలి కనిపించింది. దీంతో వాహనదారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. భక్తులను అప్రమత్తం చేశారు. తాజాగా మరోసారి చిరుత సంచారం భక్తుల్లో భయాందోళనకు కలిగిస్తోంది.
