పటాన్ చెరు దగ్గర వ్యాపారి డబ్బుతో ఓ లారీ డ్రైవర్ పరారయ్యాడు. మిరపకాయలు అమ్మి లారీలో వెళ్తుండగా వ్యాపారి డబ్బుతో డ్రైవర్ మాయమయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి.. మహారాష్ట్ర సోలాపూర్లో మిరపకాయలు అమ్మాడు. తిరిగి గుంటూరుకు లారీలో వెళ్తున్న క్రమంలో మూత్ర విసర్జన కోసం పటాన్చెరు దగ్గర లారీ దిగాడు. లారీలోనే ఉంచిన రూ. 70 లక్షలతో లారీతో డ్రైవర్ ఉడాయించాడు.
షాక్ కి గురైన వ్యాపారి కాసేపటికి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం ఇస్లాంపూర్ దగ్గర లారీని గుర్తించారు. కానీ అందులో డ్రైవర్ లేడు, డబ్బూ లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల లారీలో మిర్చి లోడును మహారాష్ట్రలోని షోలాపూర్కు తీసుకెళ్లి అమ్మాడు. అలా అమ్మిన మిర్చితో రూ.70లక్షల నగదు వచ్చింది. దాన్ని తీసుకుని లారీలో స్వగ్రామానికి బయలుదేరాడు. మంగళవారం(ఏప్రిల్ 28,2020) తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తారం దగ్గరకు రాగానే ఏడుకొండలు మూత్ర విసర్జన కోసం ఆగాడు.
అదే సమయంలో లారీ డ్రైవర్ నగదుతో ఉడాయించారు. లారీ డ్రైవర్ తన సెల్ఫోన్ ను లారీలోనే వదిలేసి వెళ్లడంతో అతడిని ట్రాక్ చేయడం కష్టంగా మారింది. బాధిత వ్యాపారి నుంచి డ్రైవర్ వివరాలు, ఫోటోలు సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. లారీ ఒడిశాకు చెందినది కాగా.. డ్రైవర్ ఉత్తర్ప్రదేశ్కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే డబ్బుతో ఉడాయించినట్లు తెలుస్తోంది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.