Bay of Bengal Low pressure : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారునుంది. తదుపరి 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. రాగల 3 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడి అవకాశం ఉంది.
మరోవైపు నివార్ తుపాన్ రైతులను నిండా ముంచింది. చేతికొచ్చిన పంటను నీటిపాలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో నివార్ తుపాను ప్రధానంగా 10 జిల్లాలపై ప్రభావం చూపింది. ఈ జిల్లాల్లోని 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతులకు 1500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా భావిస్తోంది. ఈ నష్టం మరింత పెరిగే అవకాశముంది.
నివార్ తుపాను కారణంగా కురిస్తున్న వర్షాలతో వరిపైరు నీట మునిగింది. పలుచోట్ల వరిపంట నేల కరవడంతో రైతులకు పెద్ద ఎత్తు నష్టం వాటిల్లింది. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, ముంచెత్తుతున్న వరదలతో 20 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఇప్పుడు నివార్ తుపాను కూడా అన్నదాత ఆశలన్ని తుంచేసింది. చేతికొచ్చిన పంటలను ఊడ్చిపెట్టుకు పోయింది.