ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట..
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.
- Harishth Thanniru
- Published On : May 28, 2024 / 11:57 AM IST
Pinnelli Ramakrishna Reddy
Pinnelli Ramakrishna Reddy : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనవచ్చునని హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Also Read : Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారా?
ఎన్నికల పోలింగ్ సమయంలో పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసంను అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్ బూత్ వద్ద మహిళపై దుర్భాషలాడిన కేసు, కారంపూడిలో సీఐపై దాడి చేసిన కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి హైకోర్టుకు వెళ్లారు. మూడు పిటీషన్ల పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం ఇరువర్గాల వాదనలు విన్నకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. మూడు కేసుల్లో పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Also Read : పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా మూడు కేసుల్లోనూ పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు ప్రస్తుతం మూడు కేసుల్లోనూ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసుతోపాటు ప్రస్తుతం మూడు కేసులు మొత్తం నాలుగు కేసులను కౌంటింగ్ తరువాతనే కోర్టులో విచారణ ఉంటుంది. అప్పటి వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడం పిన్నెల్లికి పెద్ద ఊరట అనే చెప్పొచ్చు.
