కరోనా ఫైట్‌కు కేసీఆర్‌తో మేము సైతం అంటున్న చిరు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రబలకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం వాటిని మీడియా ముఖంగా వెల్లడించారు. గుమిగూడి ఉండాల్సిన ప్రదేశాలకు వెళ్లొద్దని ఈ మేరకు స్కూళ్లు, సినిమా హాళ్లు వంటివి బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31వరకూ పెళ్లిళ్లకు అనుమతించి ఆ తర్వాత వాటిని కూడా వాయిదా వేయాలని తెలిపారు. సీఎం వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. 

‘సినిమా షూటింగ్ లను తక్షణం వాయిదా వేస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది, మరింత అప్రమత్తత అవసరం. కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్విముఖ వ్యూహాన్ని అవలంభిస్తోన్నాయి. కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి కాకుండా జనాలు గుమికూడకుండా క్రీడల్ని వాయిదా వేయడం, మాల్స్, సినిమా హాల్స్ ని మూసివేయడం, స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించడం. తదితర చర్యలు తీసుకోవడం ముదావహం. 

కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలివేయకుండా అందరూ భాగస్వామ్యులు కావాలి. అందరిలో చైతన్యం కలిగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ముందస్తు నివారణా చర్యలు ప్రారంభించారు. పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాను.

సినిమా షూటింగ్స్ లో కూడా పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్స్ వాయిదావేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. 

ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోన్న సినిమా షూటింగ్‌ని వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు వెంటనే అంగీకరించారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కనుక ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ని నియంత్రణ చేసే ఉద్యమంలో సినీరంగం కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నాను. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ అభిమానులకు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు.