Botsa
Minister Botsa Satyanarayana : ఏపీ మూడు రాజధానులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని చెప్పారు. ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతున్నామన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని అన్నారు. టీడీపీ నేతలు తమకు ప్రామాణికం కాదని తేల్చి చెప్పారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులపై బిల్లు పెట్టే అంశంపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. విజయనగరం జిల్లా పునర్విభజనపై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. ఉగాదికి కొత్త జిల్లాల నుండి పాలన ప్రారంభమవుతుందని చెప్పారు.
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీనిపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం (మార్చి3, 2022) తీర్పు వెల్లడించింది. ప్రభుత్వానికి శాసనాధికారం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఆర్డీఏ చట్ట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని తెలిపింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వివిధ పిటిషన్లపై వేర్వేరు తీర్పులు వెల్లడించింది. రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఆరు నెలల్లో పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
Minister Botsa : సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు- హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స
పిటిషన్ దారులకు ఒకొక్కరికి 50వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఆదేశించింది. అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని పేర్కొంది. రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఇతర అవసరాలకు భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ అంశంలో రైతులు పిటిషన్ లు దాఖలు చేశారు.
ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విశాఖపట్టణం పరిపాలన, అమరావతి శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా పరిగణించనున్నారు. సెక్రటేరియట్, గవర్నర్ కార్యాలయం విశాఖపట్టణంలో ఏర్పాటవుతాయని, అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Minister Sucharita : ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం : హోంమంత్రి సుచరిత
విశాలమైన రీతిలో ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే 3 రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. మరింత మెరుగైన ప్రతిపాదనలతో సభ ముందుకు కొత్త బిల్లును తీసుకువస్తామన్నారు. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా గానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.
అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరుస్తామని తెలిపారు. ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని చెప్పారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.