Minister Nadendla Manohar : కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంతో సీబీసీఐడీ ఎంక్వైరీకి సీఎం చంద్రబాబు ఆదేశించారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 1066 కేసులు నమోదు చేశామన్నారు. దీని ద్వారా 62వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. సీజ్ చేసిన బియ్యం విలువ బహిరంగ మార్కెట్ లో 240 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు.
‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1066 కేసులు నమోదు చేశాం. 1066 కేసుల్లో 62వేల మెట్రిక్ టన్నుల బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది. దాని మార్కెట్ విలువ రూ.240 కోట్లు. అయినా, వీళ్లు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం. ఒక్క కాకినాడ పోర్టు నుంచే గత మూడేళ్లలో కోటి 31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగింది.
అక్కడ స్మగ్లింగ్ డెన్ గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే విధంగా వారు పరిపాలించిన విధానం అందరికీ తెలిసిందే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున.. కాకినాడలో జరిగిన సంఘటనలను, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులు, స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు.. వీటిపై సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంతో సీబీసీఐడీ విచారణకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
”రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్లను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ లో కానివ్వండి.. మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పని చేయాల్సిందే. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే విధంగా, నిజాయితీగా, పారదర్శకంగా వ్యాపారాన్ని చేస్తే ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యే విధంగా మీరు నిలబడాలి. అంతేకానీ, ప్రభుత్వపు వ్యతిరేకత తెచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటే కచ్చితంగా వాళ్లపై యాక్షన్ తీసుకుంటాం” అని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
Also Read : మంత్రులు ఎమ్మెల్యేలకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏంటి? ఈ కొత్త ట్రెండ్ చంద్రబాబు ఎందుకు స్టార్ట్ చేసినట్లు?