Musalamma Temple: అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో చిత్ర విచిత్ర సంఘటన వెలుగుచూసింది. ఆలయంలో చోరీ చేసిన డబ్బును.. . తిరిగి అదే గుడిలో వదిలి వెళ్లిపోయారు దొంగలు. అంతేకాదు.. ఓ లేఖను కూడా వదిలి వెళ్లారు. చోరీ చేసిన దేవుడి డబ్బును తిరిగి ఎందుకు గుడిలో వదిలేశారో అందులో తెలియజేశారు. బుక్కరాయ సముద్రంలోని ముసలమ్మ దేవాలయంలో ఈ మిరాకిల్ జరిగింది.
నెల రోజుల క్రితం ఆలయంలో దొంగతనం జరిగింది. గుడిలోని హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. కట్ చేస్తే.. గత రాత్రి ఆలయ ఆవరణలో దుండగులు నగదు వదిలి వెళ్లారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు, ఆలయ పెద్దలే కాదు.. పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఆలయ పెద్దలు పోలీసుల సమక్షంలో నగదు లెక్కించారు. లక్ష రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.
దొంగలు నగదుతో పాటు ఓ లెటర్ ను సంచిలో వదిలి వెళ్లారు. దేవుడి డబ్బు తిరిగి వెనక్కి ఇచ్చేయడానికి కారణం ఏంటో అందులో వివరించారు. హుండీ డబ్బు చోరీ చేసిన తర్వాత తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని, భయంతో డబ్బు తిరిగి ఇచ్చేశామని లెటర్లో రాసి ఉంది. కాగా, చోరీ చేసిన డబ్బులో కొంత మొత్తాన్ని పిల్లల ఆసుపత్రి ఖర్చులకు వాడుకున్నట్లు లెటర్ లో తెలిపారు.
హుండీలో ఎంత డబ్బు ఉంది? అందులో వాడుకున్నది ఎంత? మిగిలిన డబ్బు ఎంత? ఇలా అని వివరాలను లెటర్ లో రాశారు దుండగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, చోరీ చేసిన డబ్బును నెల రోజుల తర్వాత దొంగలు తిరిగి అదే ఆలయంలో
వదిలి వెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది.
అంతా ఆ దేవుడి మహిమ అని ఊరి ప్రజలు చర్చించుకుంటున్నారు. దేవుడి సొమ్ము ముట్టుకుంటే కీడు జరక్కుండా ఉండదని చెప్పుకుంటున్నారు. దొంగల్లో ఏర్పడిన భయమో, లేదా పశ్చాతాపమో.. కారణం ఏదైనా.. దొంగలు తిరిగి దేవుడి సొమ్మును తిరిగి అక్కడే వదిలి వెళ్లిన వైనం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. గ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత.. టైమింగ్స్ ఇవే..