Kolikapudi: క్రమశిక్షణ కమిటీతో భేటీ అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి కీలక వ్యాఖ్యలు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుట హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
- Harishth Thanniru
- Published On : January 20, 2025 / 02:43 PM IST
Tiruvuru MLA Kolikapudi Srinivasa Rao
Kolikapudi: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుట హాజరయ్యారు. కమిటీతో భేటీ ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.. క్రమశిక్షణ సంఘం సభ్యులకు రాతపూర్వకంగా, నేరుగా కలిసి అన్ని వివరాలను వెల్లడించానని చెప్పారు. ఈనెల 11వ తేదీన టీడీపీ కార్యకర్త మృతి చెందితే పరామర్శకు గోపాలపురం గ్రామం వెళ్లాను. అక్కడ వైసీపీకి చెందినవారు ప్రభుత్వం వేసిన సిమెంట్ రోడ్డుపై ముళ్లకంచె అడ్డంగా వేశారు. అక్కడ స్థానికులు కూడా కంచెదాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే నేను కంచెను తొలగించాను. నేను కంచెను తొలగించానని ఆ వైసీపీ కుటుంబ సభ్యులు నన్ను టార్గెట్ చేశారు. ఆత్మహత్యాయత్నం చేసి వైసీపీ కుటుంబ సభ్యులు రాద్దాంతం చేస్తున్నారని క్రమశిక్షణ కమిటీ సభ్యులకు వివరించినట్లు కొలికపూడి చెప్పారు.
Also Read: Polavaram: పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు నిలిపివేత.. ఎందుకంటే..?
పంచాయతీ తీర్మానంతోనే ఆ సీసీ రోడ్డు నిర్మించారు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేశారు. మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్ పై గతంలో ఆ కుటుంబ సభ్యులే దాడులు చేసి వాహనాలు పగలగొట్టారు. ఘటన రోజు జరిగిన పరిణామాలన్నీ ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు వివరించానని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. సోషల్ మీడియాలో ఒక రకంగా వస్తుంది.. అక్కడ జరిగిన వాస్తవం వేరు. వాస్తవాలు ఏమిటనేది తిరువూరు ప్రజలను అడిగితే తెలుస్తుంది. రోడ్డుపై అడ్డంగా ఉన్న ముళ్ల కంచెను తీయడం చట్టాన్ని ఉల్లంఘించటమా..? అంటూ కొలికపూడి ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులకు రాతపూర్వకంగానూ, నేరుగాను కలిసి మొత్తం ఘటనకు సంబంధించిన వివరాలను వివరంగా చెప్పడం జరిగిందని కొలికపూడి చెప్పారు.
Also Read: Davos Tour: జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఫొటో వైరల్
వివరాలన్నీ హైకమాండ్ కు పంపిస్తాం :కొనకళ్ల నారాయణ
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి ఆరోజు ఏం జరిగిందనే విషయాన్ని చెప్పారని క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కొనకళ్ల నారాయణ అన్నారు. గోపాలపురం మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనలో వివరాలు అడిగాం. ఎమ్మెల్యే చెప్పిన వివరాలన్నీ హై కమాండ్ కు పంపిస్తాం. ఈ వివాదంలో నా ప్రమేయం లేదని కొలికపూడి చెప్పారు. వైసీపీ వాళ్లు కంచె వేయడం వల్లే నేను ఆ కంచెను తొలగించానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
టీడీపీలో ఎవరైనా క్రమశిక్షణ పాటించాల్సిందే: వర్ల రామయ్య
టీడీపీలో ఎవరైనా క్రమశిక్షణ పాటించాలని టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. కార్యకర్త అయిన, ఎమ్మెల్యే అయినా టీడీపీలో ఒకటే. తిరువూరు ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటుతున్నారని తెలుస్తోంది. నీ వ్యవహారశైలి సరిగా లేదని ఈరోజు క్రమశిక్షణ కమిటీ సభ్యులు అందరం కొలికపూడికి చెప్పాము. నీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని వివరించాం. ఈ ఏడు నెలల్లో రెండు ఘటనల్లో కొలికపూడి రెండుసార్లు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. త్వరలో చంద్రబాబుకు కొలికపూడి వ్యవహారంపై రిపోర్టు అందజేస్తామని వర్ల రామయ్య చెప్పారు.
