ఏపీలో కీలక పరిణామం.. మండలి ఛైర్మన్పై అవిశ్వాసం.. ఆ వైసీపీ ఎమ్మెల్సీల ప్లాన్
AP Legislative Council : ఏపీ మండలి చైర్మన్ మో షేనురాజుపై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
- Harishth Thanniru
- Published On : March 4, 2026 / 12:01 PM IST
Chairman Moshe Na Raju
AP Legislative Council : ఏపీ మండలి చైర్మన్ మోషేనురాజుపై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణలు ఆ పార్టీతోపాటు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. అయితే, ఆ ఐదుగురు సభ్యులు రాజీనామా చేసినా ఇంత వరకూ మండలి చైర్మన్ ఆమోదించలేదు. చైర్మన్ తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాసం పెట్టాలని ఆ ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండడంతో ఈ నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. మండలి ఛైర్మన్గా నాడు వైసీపీ నుంచి మోషేన్ రాజును ప్రతిపాదించింది నేనే.. ఆయనపై ఇప్పుడు అవిశ్వాసం పెట్టాలని కూడా నేనే ప్రతిపాదిస్తా. రాజీనామాలు ఆమోదించమని ఎన్నిసార్లు స్పష్టం గా చెప్పినా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని కల్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, పెత్తందారీ పోకడలకు నిరసనగా ఆ పార్టీ ద్వారా నాకు వచ్చిన శాసనసమండలి సభ్యత్వానికి రాజీనామా చేశా. 30.08.24న రాజీనామా చేసినా ఇప్పటివరకు ఆమోదించలేదు. నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఛైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం దుర్మార్గం. ఛైర్మన్ ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, అవమానకరంగా ఉంది. శాసనమండలి సభ్యత్వానికి నా రాజీనామాను ఆమోదించమని స్వయంగా శాసనమండలి ఛైర్మన్ను పలుమార్లు కలిసి కోరినా స్పందించకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు.
శాసనమండలి ఛైర్కు ఉన్న విలువలను కాపాడాలని కోరుతున్నా. వైసీపీలో ఉండలేక స్వచ్చందంగా రాజీనామా చేశామనే సమాధానం ఎన్ని సార్లు చెప్పమంటారో అర్ధం కావట్లేదు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని ఇప్పటికే ఛైర్మన్ కు అనేకమార్లు స్పష్టం చేశామని పేర్కొన్నారు.
రాజీనామా ఉపసంహరణ పునరాలోచన ఏమైనా ఉందా అని ఛైర్మన్ అడిగినా లేదని తేల్చి చెప్పాం. సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదనే అనుమానం ఉంటే మాత్రమే విచారణ జరపాలని రాజ్యాంగం చెప్తోంది. రాజీనామా పత్రాలు స్వయంగా తీసుకెళ్లి ఇవ్వటంతో పాటు, ఇప్పటికీ అనేక సార్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశామనే విషయం ఛైర్మన్ కు చెప్పాం. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాం. ఇంకా ఎన్నిసార్లు అడిగినా మాది ఇదే సమాధానం. స్వచ్ఛందంగా రాజీనామాలు చేయలేదని ఒప్పించే తపన ఛైర్మన్కు ఎందుకు ఉందో అర్ధం కావట్లేదని కల్యాణ్ చక్రవర్తి అన్నారు.
