ఆయన నాన్ కాంట్రవర్సీ లీడర్. మంచి బిజినెస్ మెన్ కూడా. 2018 వరకూ ఆయనకు ఎలాంటి రాజకీయ వాసనలు లేవు. అందరి వారిగా ఉంటూ వచ్చిన వారు. కానీ ఆల్ ఆఫ్ సడెన్గా 2019లో వైసీపీ నుంచి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత జగన్తో విబేధించి టీడీపీ గూటికి చేరి 2024లోనూ ఎంపీగా గెలిచారు. ఒకప్పుడు వైసీపీలో ఆయన ప్రత్యర్థులుగా ఉన్నవారు..ఇప్పుడు వేమిరెడ్డి టీడీపీ ఉండటంతో డైరెక్ట్ అటాక్కు దిగుతూ అలిగేషన్స్ చేస్తున్నారు.
దీంతో ఎంపీ గారు నొచ్చుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో అంగబలం, అర్ధబలం రెండూ జతకలసి టీడీపీకి అంది వచ్చిన అస్త్రంగా మారిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి వైసీపీకి టార్గెట్ అయ్యారు. వైసీపీలో ఒకనాటి ప్రత్యర్థులంతా ఇప్పుడు ఆయనకు ఎదురు నిలిచి సవాల్ చేస్తుండటంతో ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ ఎంపీగారు..పెద్ద డెసిషనే తీసుకున్నారట.
అలిగేషన్స్ ఎక్కువైపోవడంతో నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 400 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు. 400 కోట్ల రూపాయల పెట్టుబడితో క్వార్ట్జ్ ఫ్యాక్టరీ పెట్టి వెయ్యి మందికి ఉపాధి కల్పించాలని అనుకున్నానని, ప్రభుత్వాన్ని అనుమతులు అడిగానని చెప్పుకొచ్చారు. అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వార్ట్జ్ పరిశ్రమ నెలకొల్పాలని అనుకున్నట్లు చెప్తున్నారు.
సొంత డబ్బుతో సేవ చేస్తుంటే తనపైనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన వాపోయారు. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదంటున్న ఆయన..ఎవరన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టాలని వస్తే వారికి సహకరిస్తానంటున్నారు. అంతేకాదు క్వార్ట్జ్ అంశంలోకి తనను లాగితే వాళ్ళ ఖర్మకి వదిలేస్తున్నా అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. మాటలు పడలేకే క్వార్ట్జ్ బిజినెస్ను ఆపేస్తున్నట్లు ప్రకటించేశారు. వేమిరెడ్డి ఒక్కసారి గరం గరమై..నో బిజినెస్ అంటూ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ అవుతున్నాయి. ఆయన స్వపక్షంలోని ఎదుటి పక్షంలోని ప్రత్యర్ధులు అందరికీ ఒకే మాటతో జవాబు చెప్పారా అన్న చర్చ సాగుతోంది.
ఇంత సెన్సిటీవ్ అయితే ఎలా?
ఏ పార్టీతో సంబంధం లేకుండా బిజినెస్ చేసినప్పుడు అంతా బానే ఉంటుంది. ఏదైనా ఒక పార్టీకి దగ్గరగా ఉన్నప్పుడు లేక ఏదైనా ఓ పార్టీలో ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నప్పడే సమస్య వచ్చి పడుతుంది. వేమిరెడ్డికి ఎంత మంచి వ్యాపారవేత్త అని పేరున్నా..సొంత డబ్బులతో ప్రజలకు సేవ చేస్తున్నారని గుర్తింపు ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలు కామన్. వైసీపీలోఉన్నప్పుడు టీడీపీ ఆయనను టార్గెట్ చేయొచ్చు.
ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు కాబట్టి వేమిరెడ్డి టార్గెట్గా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. కానీ వేమిరెడ్డి టీడీపీ ఎంపీగా ఉంటూ..తనపై వస్తున్న ఆరోపణలు తట్టుకోకపోవడం చర్చకు దారితీస్తోంది. వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు అన్ని పార్టీలతో మంచి రిలేషన్స్ ఉంటాయి. కానీ రాజకీయ రంగు అంటించుకుంటేనే విమర్శలు, ఆరోపణలు కామన్. జన్యూన్గా క్వార్స్ట్ ఫ్యాక్టరీతో ప్రజలకు ఉపాధి కల్పించాలనుకున్నా..వైసీపీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పే ప్రయత్నం చేయొచ్చు.
కానీ ఆల్ ఆఫ్ సడెన్గా క్వార్ట్జ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆలోచనే విరమించుకోవడంతో.. ఎంపీగారు ఇంత సెన్సిటీవ్ అయితే ఎలా అని చర్చించుకుంటున్నారట పబ్లిక్. ఆరోపిస్తుంది ప్రతిపక్షమైనా నమ్మాల్సింది ప్రజలు కదా ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఏదైనా వేమిరెడ్డి క్వార్ట్జ్ బిజినెస్కు గుడ్బై చెప్పడం మాత్రం అటు ప్రతిపక్షంలో..ఇటు అధికార కూటమితో పాటు ప్రజల్లోనూ చర్చకు దారితీస్తోంది.