N Chandrababu Naidu (Photo : Twitter)
N Chandrababu Naidu – Kuppam : కుప్పం బస్టాండ్ వద్ద బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. లక్ష ఓట్ల మెజారిటీతో కుప్పంలో పార్టీని గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. మళ్లీ జన్మంటూ ఉంటే మీ సేవకుడిగా పుడతాను అని చంద్రబాబు అన్నారు.
” కుప్పం టీడీపీ కంచుకోట. కుప్పం, హిందూపురంలో 9 సార్లు పార్టీ గెలిచింది. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కుప్పంను నేను ఎంచుకున్నా. పులివెందులకు సైతం నీళ్లిచ్చాను. 9 నెలల్లో అధికారంలోకి వస్తున్నాము. అనుమానాలు అవసరం లేదు. హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేస్తాము. మీకు శాసనసభ్యుడిగా ఉండడం నా పూర్వజన్మ సుకృతం.
2019 తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగింది. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం వల్ల విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ నకు గురైంది. ఎంపీ కుటుంబానికే రక్షణ లేదు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఏపీలో పాలన పడకేసింది. వైసీపీ నేతలు మద్యం దుకాణాల్లో రూ.2వేల నోట్లు మార్చుకుంటున్నారు. కుప్పంని నేరస్తుల హబ్ గా తయారు చేశారు.
కుప్పంలో కొందరు వైసీపీ నేతలు వింత పశువులు, వింత జంతువులుగా ప్రవర్తిస్తున్నారు. సీఎం జగన్ నియోజకవర్గంలో ఎన్నో దురాగతాలు జరుగుతున్నాయి” అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యం పేరిట చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ”34ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మీ ప్రతినిధిగా ఉన్నా. రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. శిరస్సు వంచి కుప్పం ప్రజానీకానికి పాదాభివందనం చేస్తున్నా. మీరు చూపించిన అభిమానం, ఆదరణ ఎనలేనిది. నా జీవితంలో మర్చిపోలేను. మళ్లీ జన్మంటూ ఉంటే మీ సేవకుడిగానే పుడతాను. నా బాధ్యత పెరిగింది.
1989లో మొట్టమొదటిసారిగా కుప్పంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉన్నా, వెనుకబడిన నియోజకవర్గం కుప్పంనే ఎంచుకున్నా. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. రాజకీయ నాయకులు కులం, మతం, బలం బంధువర్గాన్ని చూసి నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంటారు. కానీ, నా బలం ఈ ప్రజలే. అందుకే, అత్యంత వెనుకబడిన నియోజకవర్గం కుప్పంను ఎంచుకున్నా. అను నిత్యం మీ అభివృద్ధి కోసం పని చేశాను” అని చంద్రబాబు అన్నారు.