Vasanta Krishna Prasad
ఏలూరులో ఎల్లుండి జరిగే సిద్ధం సభకు తాను రాలేనని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. దీంతో వైసీపీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గ ఇన్చార్జి పడమట సురేశ్ బాబుకు బాధ్యతలు అప్పగించి, సిద్ధం సభకు మైలవరం నుంచి భారీగా జన సమీకరణ చేయాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు ఇచ్చింది.
మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని, సురేశ్ బాబు సమావేశమయ్యారు. సిద్ధం కార్యక్రమానికి అందుబాటులో ఉండనని పార్టీ పెద్దలకు వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తోంది.
వసంత వైసీపీ వీడనున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటనలతో మరోమారు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఎమ్మెల్యే స్థానాల మార్పుల నేపథ్యంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అధిష్ఠానంపై ఆగ్రహంతో ఉన్నారని సీఎంతో మాట్లాడటానికి కూడా ఆయన ఇష్టపడటం లేదని ప్రచారం జరిగింది.
ఇప్పటికే మంత్రి జోగి రమేశ్తో విభేదాలు ఉండడం, ఇప్పుడు మరో సమస్య రావడంతో వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తితో ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.