Nara Bhuvaneshwari Tirumala: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆమె ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు భువనేశ్వరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భువనేశ్వరి వెంట టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఉన్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం నారా భువనేశ్వరి నారావారి పల్లెకు వెళ్లారు. అక్కడ నాగాలమ్మ, దొడ్డిగంగమ్మలకు పూజలు నిర్వహిస్తారు. బుధవారం నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర బుధవారం ఉదయం చంద్రగిరిలో ప్రారంభమవుతుంది. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర సాగుతుంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి బస్సు యాత్ర ద్వారా మూడు రోజులపాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. ఈ క్రమంలో స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ నారా భువనేశ్వరి పాల్గొని ప్రసంగిస్తారు.