Nara Lokesh, Brahmani
Nara Brahmani: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కోడలు నారా బ్రాహ్మణి ఇవాళ సాయంత్రం మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆ పార్టీ నేత నారా లోకేశ్ కార్యాలయంలో 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు బ్రాహ్మణితో పాటు పలువురు మహిళలు ఢమరుకం, డోలు వాయిస్తూ, విజిల్ వేస్తూ మోతమోగించారు.
నారా బ్రహ్మిణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. చంద్రబాబుకు న్యాయం కోసం కాదు.. ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని ఈ ప్రోగ్రాం చేస్తున్నామని తెలిపారు. న్యాయం జరగడం ఆలస్యం అవుతుంది కానీ కచ్చితంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు.
మరోవైపు, ఢిల్లీలో గంట మోగిస్తూ లోకేశ్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణ రాజు, టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసి నినాదాలు చేశారు.
కాగా, పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు విజిల్స్, గంటలతో మోత మోగించారు. కర్నూలులో పార్టీ కార్యాలయం దగ్గర మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో గంటలు, విజిల్స్ , తాళాలు, బూరలు, డప్పులు వాయిస్తూ టీడీపీ మోత మోగించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు.
విజయనగరంలోటీడీపీ పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అశోక్ గజపతిరాజు దంపతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పళ్లాలు మోగించి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు నిరసన తెలిపారు. నారా లోకేశ్ పిలుపునకు టీడీపీ నాయకులే కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు.
చంద్రబాబు అన్యాయంగా అరెస్టు చేశారని ప్రజలంతా నమ్ముతున్నారని తెలిపారు. భవిష్యత్తులో జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని అన్నారు.
ఉమ్మడి అనంతపురము జిల్లాలో మోత మోగిద్దాం కార్యాక్రంలో భాగంగా డప్పులు కొట్టి, విజిల్స్ వేసి, డ్రమ్స్ కొట్టి మోత మోగించారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు.
చంద్రబాబు నాయుడి అరెస్ట్ను ఖండిస్తూ మోత మోగిద్దాం పేరిట నిరసన కార్యక్రమానికి నారా లోకేశ్, బ్రాహ్మణి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దామని వారు నిన్న ప్రకటనలు చేశారు.
ప్యాలెస్లో ఉన్న సీఎం జగన్కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని బ్రాహ్మణి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని అన్నారు.