Nara Lokesh padayatra : నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం.. భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో శ్రీవరదరాజస్వామి ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.03 గంటలకు లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు.
- Harishth Thanniru
- Updated on- January 27, 2023 / 01:12 PM IST
Nara Lokesh
Nara Lokesh padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో లక్ష్మీపురం వద్ద శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురు టీడీపీ కీలక నేతలు పాల్గొన్నారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు తరలిరాగా.. ముందే అనుకున్న ముహూర్తం ప్రకారం 11.03 గంటలకు లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు.
Nara Lokesh Visited Tirumala : పాదయాత్ర జయప్రదంగా జరగాలని తిరుమల వెంకన్నను మొక్కుకున్న నారా లోకేశ్
లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో శ్రీవరదరాజస్వామి ఆలయం కిక్కిరిసి పోయింది. అడుగు ముందుకేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పోలీసులు, వాలంటీర్లు కార్యకర్తలను పక్కకు తరలించారు. పాదయాత్రలో భాగంగా కుప్పం పరిధిలోని కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం 3గంటలకు జరిగే ఈ బహిరంగసభలో లోకేష్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు భారీ వేదికను ఏర్పాటు చేశారు. 300 మంది నేతలు వేదికపై ఆశీనులయ్యేలా ఏర్పాటు చేశారు. సభకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు ఏర్పాటు చేశారు.
పాదయాత్ర ప్రారంభం అనంతరం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు అభివాదం చేసుకుంటూ లోకేష్ ముందుకు సాగారు. లోకేష్ కు అడుగడునా పూలు చల్లుతూ, హారతులుఇస్తూ మహిళ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
