Lokesh Yuvagalam Padayatra
Lokesh Yuvagalam Padayatra : టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ కారణంగా తాత్కాలిక విరమం ప్రకటించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే ఉదయం 10గంటల 19నిమిషాలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు పాల్గొననున్నారు.
తాటిపాక సెంటర్ లో లోకేష్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మామిడికుదురులో స్థానికులతో సమావేశం కానున్నారు. పాశర్లపూడి, అప్పనపల్లి మీదుగా అమలాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం బోడసకుర్రులో మత్స్యకారులతో లోకేష్ ముఖాముఖి ఏర్పాటు చేయనున్నారు.
పేరూరులో రజక సామాజిక వర్గీయులతో భేటీ కానున్నారు. రాత్రికి పేరూరు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటి వరకు 209 రోజులపాటు 2852.4 కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. 210వరోజు అయిన నేడు రాజోలు, పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు.
ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల్లోని 84 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగింది. పాదయాత్ర సాగిన 84 నియోజకవర్గాల పరిధిల్లో 66 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. యువత, మహిళలు, రైతులు, ముస్లింలు.. ఇలా వివిధ వర్గాలతో 11 ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు. సెప్టెంబరు 9న పొదలాడలో లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించారు.