Tirumala Record: తిరుమలలో సరికొత్త రికార్డ్.. 27 రోజుల్లోనే.. 12లక్షల మందికి పైగా తలనీలాల సమర్పణ

2024 మే నెలలో 10,65,729 మంది, 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ ఏడాది ఆ సంఖ్య 12,43,063గా ఉంది.

  • Updated on- June 2, 2026 / 10:53 AM IST

Tirumala New Record More Than 12 Lakh Devotees HeadShaves

Tirumala Record: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ పుణ్యక్షేత్రం తిరుమలలో సరికొత్త రికార్డ్ నమోదైంది. రికార్డ్ స్థాయిలో భక్తులు తలనీలాలు సమర్పించారు. ‘నల్ల బంగారం’గా ప్రసిద్ధి చెందిన తలనీలాలను సమర్పించే వారి సంఖ్యలో అపూర్వమైన పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది మే నెలలో 12.43 లక్షల మందికి పైగా భక్తులు విశ్వాసానికి చిహ్నంగా తలనీలాలు సమర్పించారు.

వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లెక్కల ప్రకారం మే 1 నుండి మే 27 మధ్య మొత్తం 12 లక్షల 43 వేల 63 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించారు. వేసవి సెలవులు, వారాంతపు రద్దీ, దేశ విదేశాల నుండి నిరంతరం వస్తున్న యాత్రికుల కారణంగానే ఈ పెరుగుదల నమోదైందని ఆలయ అధికారులు తెలిపారు.

Also Read: 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. 338 శాతం పెరగనున్న ఉద్యోగుల జీతాలు? 5 ఫ్యాక్టర్ ఫార్ములా లెక్కలివే..!

ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. దర్శనానికి ముందుగా భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో సమర్పించారు. మే 1 నుంచి మే 27వ తేదీ వరకు 12 లక్షల మందికిపైగా భక్తులు స్వామి వారికి మొక్కుల రూపంలో తలనీలాలు సమర్పించుకున్నారని.. గతంలో ఉన్న రికార్డులను ఇది అధిగమించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

”2024 మే నెలలో 10,65,729 మంది, 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ ఏడాది ఆ సంఖ్య 12,43,063గా ఉంది. వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల రాక భారీగా పెరిగింది. మే 18 నుంచి 23 వరకు వరుసగా 6 రోజులు ప్రతిరోజూ 50 వేల మందికిపైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా మే 23న ఒక్కరోజే 57వేల 580 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు” అని టీటీడీ అధికారులు తెలిపారు.