Kodali Nani: పాదయాత్ర రాజధాని కోసమా..? చంద్రబాబు కోసమా? ఏపీ అసెంబ్లీలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చాడని, అశ్వినీదత్, రాఘవేంద్రరావు వంటి వారికి కోరుకున్న చోట కారుచౌకగా భూములు కట్టబెట్టారని అన్నారు. ఖమ్మంలో కార్పొరేటర్ గా గెలవలేని రేణుకాచౌదరి అమరావతి గురించి మాట్లాడటం సిగ్గుచేటని నాని అన్నారు.
- Harishth Thanniru
- Published On : September 15, 2022 / 03:33 PM IST
Kodali Nani
Kodali Nani: అమరావతినే రాజధానిగా ఉంచాలని కొందరు పాదయాత్ర చేస్తున్నారని, వారుచేసే పాదయాత్ర రాజధాని కోసమా? చంద్రబాబు కోసమా? అంటూ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదని, మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని నాని అన్నారు. కానీ, సీఎం జగన్ పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు తనకు కావాల్సిన వారికి కారుచౌకగా భూములు కట్టబెట్టారని, అశ్వినీదత్, రాఘవేంద్రరావు వంటి వారికి కోరుకున్న చోట అమరావతిలో భూములిచ్చారని ఆరోపించారు. అమరావతిలో ధనికులే ఉండాలా? పేదలు ఉండొద్దా? అంటూ నాని ప్రశ్నించారు. అమరావతిని కమరావతి, భ్రమరావతి చేసింది చంద్రబాబేనని అన్నారు. అమరావతిని చంద్రబాబు రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చాడని, అక్కడ భూములు కొన్నవాళ్లే అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
ఖమ్మంలో కార్పొరేటర్ గా గెలవలేని రేణుకాచౌదరి అమరావతి గురించి మాట్లాడటం సిగ్గుచేటని, ఒక్క ప్రాంతమే అభివృద్ధి అయితే మిగతా ప్రాంతాలు ఏం కావాలని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు రాష్ట్రాభివృద్ధి అవసరం లేదని, స్వార్థ ప్రయోజనాలే వారికి కావాలని, దుర్మార్గులంతా కలిసి రోడ్లపైకి వచ్చారంటూ కొండాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
