MLA Kodali Nani : జూ.ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరు, చంద్రబాబు కొత్త పార్టీ-కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఎవరో అడిగారని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు. లక్ష్మీపార్వతి అడిగినా, తాను అడిగినా పార్టీ పగ్గాలు తీసుకోరని తేల్చి చెప్పారు.
MLA Kodali Nani : నందమూరి హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీని బలంగా కోరుకుంటున్న వారిలో వైసీపీ నాయకులు ముందున్నారు. అలాగని వైసీపీలోకి రమ్మని మాత్రం కోరడం లేదు. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టమని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే లక్ష్మీపార్వతి అలాంటి డిమాండ్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వాళ్లలో తాను కూడా ఉన్నానని లక్ష్మీపార్వతి అనేకసార్లు చెప్పారు. తాజాగా ఆమె మరో డిమాండ్ తెచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోవాలన్నారు.
తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరో అడిగారని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు. లక్ష్మీపార్వతి అడిగినా, తాను అడిగినా పార్టీ పగ్గాలు తీసుకోరని తేల్చి చెప్పారు. టైమ్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా పార్టీ పగ్గాలు తీసుకుంటారని కొడాలి నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు డిపాజిట్ కూడా రాదన్నారు.
టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ తీసుకోవడంతో చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకుని జనసేన కలిసి పోటీ చేస్తారని కొడాలి నాని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు చివరి ఎన్నికలని, ఇద్దరికీ డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. 2024 ఎన్నికలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పీడ విరగడవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
”లక్ష్మీపార్వతి అడిగారని, నేను అడిగానని జూ.ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు తీసుకోరు. అవకాశం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, తీసుకోగలం అన్నప్పుడు, తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా పార్టీ పగ్గాలు తీసుకుంటాడు. తొందర ఎందుకు? బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయి. చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకుని ఆ పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయి. చంద్రబాబు, పవన్ కు ఇద్దరికీ డిపాజిట్లు ఉండవు. 2024 ఎన్నికల్లో జరిగేది ఇదే. చంద్రబాబుకి కుప్పంలో ఇల్లుందా? వాకిలుందా? ఆఫీసుందా? కనీసం కుప్పంలో ఓటరా? బయటి నుంచి టీడీపీ కార్యకర్తలను, నాయకులను తీసుకెళ్లి, కుప్పంలో ఉన్న వైసీపీ శ్రేణుల ఇళ్ల మీద జెండాలు పీకుతాను అంటే ఎలా? జెండాలు పీకడానికి చంద్రబాబు ఎవరు? అసలు చంద్రబాబుకి కుప్పంలో అడ్రస్ ఉందా?” అని కొడాలి నాని అన్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గంలో చంద్రబాబుపై వ్యతిరేకత మొదలైందన్నారు కొడాలి నాని. చంద్రబాబుకు కుప్పంలోనూ ఎదురుగాలి వీస్తోందని.. ఆఖరికి కుప్పంలోనూ చంద్రబాబు పోరాడాల్సి వస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమితో రాష్ట్రంతో పాటు, కుప్పంలో సైతం చంద్రబాబు పీడ విరగడవుతుందన్నారు. కుప్పంలో అడ్రస్, ఓటర్ కార్డులేని చంద్రబాబు.. సీఎం జగన్ కు ఏ విధంగా సవాల్ విసురుతారని కొడాలి నాని ప్రశ్నించారు. సీఎం జగన్ దెబ్బకు టీడీపీ, జనసేన, బీజేపీ వచ్చే ఎన్నికల్లో కకావికలం అవుతాయన్నారు.
కాగా.. వైసీపీ మాత్రం ఎప్పుడూ సింగిల్ గానే పోటీ చేస్తుందని కొడాలి నాని తేల్చి చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూటమిని వైసీపీ ఓడిస్తుందన్నారు. 2024 ఎన్నికలే ఆ పార్టీలకు చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు.