Kodali Nani : మూడు రాజధానులు తథ్యం.. విశాఖలో రూ.10వేల కోట్లు పెడితే సంపద సృష్టించవచ్చు-కొడాలి నాని హాట్ కామెంట్స్
పరిపాలన రాజధానిని వైజాగ్ తీసుకెళ్లడం తథ్యం అన్నారు కొడాలి నాని. పరిపాలన రాజధాని విశాఖతో పాటు న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.
Kodali Nani : ఏపీలో మరోసారి మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానుల ఏర్పాటుపై వెనక్కి తగ్గేది లేదంటున్నారు అధికార వైసీపీ నేతలు. తాజాగా మూడు రాజధానులపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
పరిపాలన రాజధానిని వైజాగ్ తీసుకెళ్లడం తథ్యం అన్నారు కొడాలి నాని. పరిపాలన రాజధాని విశాఖతో పాటు న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. వైజాగ్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్న విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు.
విశాఖలో కేవలం రూ.10 వేల కోట్లు పెడితే సంపద సృష్టించవచ్చన్నారు కొడాలి నాని. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు కొడాలి నాని. అమరావతిని మహా నగరాలతో పోల్చి ప్రజలకు చంద్రబాబు ఆశలు కల్పిస్తున్నారని ఆరోపించారు. 29 నియోజకవర్గాలున్న రాజధాని ఎక్కడ? అని ప్రశ్నించిన నాని… 29 గ్రామాలున్న అమరావతి ఎక్కడ అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. మాకు అమరావతి ఎంతో విశాఖ కూడా అంతే అని తేల్చి చెప్పారు.
”టెక్నికల్ గా మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? ఇది రెచ్చగొట్టే చర్య కాదా? వైజాగ్ రాజధాని వద్దంటారు, మళ్లీ అదే వైజాగ్ కి వెళ్తారు. ఆ ప్రాంతంలో అల్లర్లు జరిగితే ఆ మంటల్లో చంద్రబాబు చలి కాచుకుంటాడు.
బుర్ర పని చేయని చంద్రబాబు ఎవరు? గ్రాఫిక్స్ వరల్డ్ రిలీజ్ చేసి రైతులను మోసం చేసినటువంటి చంద్రబాబుని.. ఇంద్రుడు, చంద్రుడు, భగవంతుడు, హైదరాబాద్ కనిపెట్టాడు అని పొడగటం దారుణం. అసలు చంద్రబాబు ఎవరు? చంద్రబాబు తాత పుట్టకముందే హైదరాబాద్ మహానగరం ఉంది. ఈ 420 మాటలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులకు మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంది.
పాదయాత్రలు చేస్తే చేసుకోవచ్చు. డబ్బులు పోగేసుకుంటే పోగేసుకోవచ్చు. వైజాగ్ మీద దాడి చేసి అక్కడున్న ప్రజలను రెచ్చగొట్టి ఆ చలి మంటల్లో చలి కాచుకోవాలని చంద్రబాబు లాంటి 420 వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకి ఇటువంటి అవకాశం ఇవ్వొద్దని, ఆ ప్రాంత ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నారు.
మాకు అమరావతి ఎంతనో విశాఖ అంతే. విశాఖ ఎంతనో కర్నూలు అంతే. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో సమగ్రమైన అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర సంపద అన్ని ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలకు కూడా ఇవ్వాలని, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. ఒకే చోట రూ.2లక్షల కోట్లు ఖర్చు పెట్టి అక్కడున్న కొంతమందికి లాభం చేకూర్చి మిగిలిన ప్రజానీకానికి గాలికి వదిలేస్తే, మా ప్రాంత ప్రజలు కూడా ఒప్పుకోరు” అని కొడాలి నాని అన్నారు.