Palle Challenge JC : నీకంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటా- జేసీకి టీడీపీ నేత సవాల్

బాహుబలి సినిమాలో కాలకేయునిలా ఉన్నావ్. సహాయకులు లేకుండా 50 మీటర్లు నడిచి చూపిస్తే నీకు గండపెండేరం తొడుగుతా.

Palle Challenge JC : అనంతపురం జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వర్గపోరు తారస్థాయికి చేరింది. సొంత పార్టీకి చెందిన నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరింది. జేసీ పుట్టపర్తి పర్యటన, పల్లెపై చేసిన అవినీతి ఆరోపణలు చిచ్చు రాజేశాయి. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై పల్లె రఘునాథ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

”నిన్ను చూస్తుంటే బాహుబలి సినిమాలో కాలకేయునిలా ఉన్నావ్. జగన్ దయాదాక్షిణ్యాలతో మున్సిపల్ చైర్మన్ అయ్యాను అని చెప్పుకునే నీకు టీడీపీపై ప్రేమ ఉందా? కల్లు తాగిన కోతిలా ఉంటుంది జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి అని జనాలు అంటున్నారు. నువ్వు ఒక బఫూన్ అని ఆల్రెడీ ముద్రపడింది. ఇంకా ఎందుకు దిగజారి మాట్లాడతావ్. నా టిక్కెట్ సంగతి పక్కన పెట్టు. ముందు నువ్వు టికెట్ తెచ్చుకో చూద్దాం” అంటూ జేసీకి సవాల్ విసిరారు పల్లె రఘునాథ్ రెడ్డి.

JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు

”దారి కూడా సక్రమంగా నడవ లేని నువ్వు నా గురించి మాట్లాడతావా? సహాయకులు లేకుండా 50 మీటర్లు నువ్వు నడిచి చూపిస్తే చాలు నీకు గండపెండేరం తొడుగుతా. తాడిపత్రిలో నాకు అభిమానులు ఉన్నారు. అంతమాత్రాన నేను తాడిపత్రికి వచ్చి పెత్తనం చెలాయించడం లేదే. నాకంటే సమర్ధుడు, ఆర్థికంగా బలంగా ఉన్న వాడు వస్తే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి ఏళ్ల తరబడిగా పార్టీలో ఉన్న మాపైనే పెత్తనం ఏంటి.? పార్టీ బాగు కోసం ఎంతకైనా తెగిస్తా.

నోటి దురద ఉన్న రాజకీయ నాయకుడు బాగుపడినట్లు చరిత్రలో లేదు. మనం మనం విమర్శలు చేసుకుంటూ ఉంటే నికార్సైన టీడీపీ కార్యకర్తలు కుమిలిపోతున్నారు. ఇప్పటికైనా ఈ వివాదానికి తెర దించి నీ పని నువ్వు చూసుకో. నువ్వు నేను ఇద్దరం ప్రజల్లోకి వెళదాం. మన ఇద్దరిలో ఎవరు మంచి వారో ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. నీకంటే ఒక్క ఓటు నాకు తక్కువ వచ్చినా రాజకీయాల శాశ్వతంగా తప్పుకుంటా” అని జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు పల్లె రఘనాథ్ రెడ్డి.

Palle Raghunatha Reddy Challenge JC Prabhakar Reddy

చంద్రబాబు విధించిన నిబంధనల మేరకే ఇతర నియోజకవర్గాల్లో తాను జోక్యం చేసుకోవడం లేదన్నారు. లేదంటే తాడిపత్రిలో ఎప్పుడో పర్యటించే వాడిని అన్నారు. జేసీ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.

JC Asmith Reddy: మా లక్ష్యం ఒక్కటే చంద్రబాబుని మరో సారి ముఖ్యమంత్రిని చేయడం: జేసి అస్మిత్ రెడ్డి

తన నియోజకవర్గంలో జేసీ తల దూరిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి పల్లె హెచ్చరించారు. తన నియోజకవర్గంలో కార్యకర్తల కష్టసుఖాలు తాను చూసుకుంటానని.. టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలోకి వచ్చి జేసీ ప్రభాకర్‌రెడ్డి చిచ్చు రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఏదైనా ఉంటే తనతో చర్చించాలని.. పుట్టపర్తి ఉజ్వల భూకబ్జాల అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. న్యాయం జరగకపోతే పోరాటం చేస్తానన్నారు.

కాగా, పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓపెన్ సైట్స్ ఆక్రమించారని జేసీ ఆరోపిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి వాటిని పరిశీలించేందుకు వెళ్తుండగా.. మరూర్ టోల్ గేట్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేసీ గోబ్యాక్ అంటూ మాజీ మంత్రి పల్లె వర్గీయులు.. పుట్టపర్తిలో నిరసన తెలిపారు. నా నియోజకవర్గంలో నువ్వు ఎలా పర్యటిస్తావు అని పల్లె ప్రశ్నిస్తుండగా.. కార్యకర్తల్లో భరోసా నింపేందుకే అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

Palle Raghunatha Reddy Challenge JC Prabhakar Reddy

కాగా, పుట్టపర్తి టికెట్ రఘునాథ్ రెడ్డికి ఇస్తే టీడీపీ ఓడిపోతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. టీడీపీలో అవసరమైతే తనతో పాటు అందరినీ మార్చాలంటున్నారు. తాడిపత్రిలో సైతం తన కుమారుడు అస్మిత్ రెడ్డి కంటే మంచి వ్యక్తి ఉంటే వారికే టికెట్ ఇవ్వొచ్చన్నారు. పుట్టపర్తిలో ప్రముఖ పారిశ్రామికవేత్త సైకం శ్రీనివాసరెడ్డిని జేసీ తెరపైకి తేవడంతో రగడ మొదలైంది.

జేసీ వ్యాఖ్యలపై పల్లె ఫైర్ అయ్యారు. జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దని జేసీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ మాత్రం నియోజకవర్గంలో తెలియని వారు.. పార్టీ కోసం కష్టపడని వారు, కొత్త ముఖాలకు టిక్కెట్లు ఇస్తే ఎలా గెలుస్తారో చెప్పాలన్నారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అంతేకాదు గతంలోనూ రఘునాథ్‌రెడ్డిపై జేసీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది.

ట్రెండింగ్ వార్తలు