Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ తన పార్టీ ప్రచార రథం ‘వారాహి’కి వాహన పూజ చేయించారు. పవన్ వెంట ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు. పవన్ పర్యటన సందర్భంగా విజయవాడ, ఇంద్రకీలాద్రి పరిసరాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముందుగా ఆలయానికి చేరుకున్న పవన్ దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. పవన్కు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, వాహనానికి పవన్ పూజ చేయించారు. కొండ దిగువన ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద వారాహికి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ‘‘అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రి వచ్చాం. కొండగట్టులో వారాహికి పూజలు చేశాం. ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడను. ఏపీ సుభిక్షంగా ఉండాలి. కొత్త నాయకులు రావాలి. రాక్షస పాలనను తరిమికొట్టడమే వారాహి లక్ష్యం’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ తన పర్యటన సందర్భంగా రెండు రోజులపాటు ఏపీలోనే ఉండనున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పార్టీ నేతలతో సమావేశమవుతారు. బుధవారం జన సైనికులతో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పై చర్చిస్తారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. పవన్ పర్యటన నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై భక్తుల వాహనాలకు అధికారులు అనుమతి నిరాకరించారు. భక్తులు మహామండపం మీదుగానే రావాలని సూచించారు. పవన్ పర్యటన సందర్భంగా ఇంద్రకీలాద్రికి భారీ ఎత్తున జన సైనికులు చేరుకున్నారు.