Pawan Kalyan Homam
Pawan Kalyan Homam : మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హోమం ప్రారంభమైంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పవన్ కళ్యాణ్ హోమం, యజ్ఞ పూజలు నిర్వహిస్తున్నారు. అంతకంటే ముందు పార్టీ కార్యాలయ ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. హోమ కార్యక్రమానికి, భూమి పూజ కార్యక్రమాలకు పార్టీ నేతలకు ఆహ్వానం లేదు. ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ యాగం చేపట్టారు.
పవన్ గణపతి పూజతో యాగానికి స్వయంగా అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం 6.55 గంటలకు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్ర ధారణలో యాగశాలకు వచ్చి పవన్ దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో పవన్ దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు.
యాగశాలలో ఐదుగురు దేవతామూర్తులు స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అష్టైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత.. త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ యాగం మంగళవారం కూడా కొనసాగనుంది.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది.
ఈ యాగం చేపట్టేందుకు ఆదివారం సాయంత్రానికే పవన్ కళ్యాణ్ యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్దంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతనను కలిగిస్తోంది.