×
Ad

pawan Kalyan : ధర్మవరంలో కౌలు రైతు రామ‌కృష్ణ కుటుంబ స‌భ్యుల‌కు పవన్ ప‌రామ‌ర్శ..రూ.ల‌క్ష చెక్ ఇచ్చిన జనసేనాని

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కౌలురైతు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి రూ.1లక్ష చెక్ ఇచ్చారు.

  • Published On : April 12, 2022 / 12:10 PM IST

Pawan Kalyan Reaches Satyasai District Dharmavaram

pawan Kalyan reaches satyasai district Dharmavaram.. : ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలకు తాను ఉన్నాను అని భరోసా ఇస్తున్నారు. దీని కోసం పవన్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. దీంట్లో భాగంగానే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సత్యసాయి జిల్లా (ఉమ్మడి అనంతపురం జిల్లా) కొత్త చెరువు విజయనగర్ కాలనీలో అప్పుల బాధతో మృతి చెందిన రైతు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. రామ‌కృష్ణ‌ భార్య సుజాతకు లక్ష రూపాయల చెక్‌ అందజేశారు.

వారి కుటుంబ సభ్యులను పరామ‌ర్శించారు. జ‌న‌సేన‌ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. పవన్ తో పాటు జ‌న‌సేన‌ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు కూడా ఉన్నారు. రామ‌కృష్ణ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి కౌలు రైతుల స‌మ‌స్య‌ల గురించి తెలుసుకున్నారు. సత్యసాయి జిల్లా కొత్తచెరువు నుంచి ప్రారంభ‌మైన జ‌న‌సేన‌ యాత్రలో భాగంగా 28 మంది కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌వ‌న్ ప‌రామ‌ర్శించ‌నున్నారు.

వారంద‌రికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. ఏపీలో ఏయే జిల్లాల్లో ఎంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న‌ వివరాలను జనసేన ఇప్ప‌టికే సమాచార హక్కు చట్టం కింద సేకరించింది. దాని ప్రకారమే ఆయా జిల్లాల్లో కౌలు రైతుల‌ను ప‌వ‌న్ ప‌రామ‌ర్శించ‌నున్నారు. కాసేప‌ట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ అనంతపురం రూరల్‌ మండలం పూలకుంట, మన్నీల గ్రామాల‌కు చేరుకుంటారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపటి క్రితం సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తన పర్యటన సందర్భంగా కొత్తచెరువులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పవన్ కు స్వాగతం పలికిన వారిలో నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన యువజన విభాగం రాష్ట్ర నేత భవానీ రవికుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ ఉన్నారు.