Pawan Kalyan Wife: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల.. వీడియో
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు.
- Harishth Thanniru
- Published On : April 14, 2025 / 08:37 AM IST
AP Deputy CM Pawan Kalyan wife Anna Konidala
PawanKalyan Wife Anna Konidela: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారు జామున శ్రీవారి సుప్రభాత సేవలలో పాల్గొన్న అన్నా లెజినోవా.. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు అన్నా లెజినోవాకు స్వాగతం పలికారు. అన్నా కొణిదల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫొటోలు, వీడియోలను జనసేన పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
ఈనెల 8న సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ కు స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే. స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరి తిత్తుల్లోకి పొగ చేరడంతో అస్వస్థతకు గురయ్యాడు. బాలుడికి సింగపూర్ లోనే వైద్య సేవలు అందించారు. మార్క్ శంకర్ కోలుకోవటంతో పవన్ కల్యాణ్, అన్నా కొణిదల కొడుకును తీసుకొని ఆదివారం సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
తన కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. అన్య మతస్థురాలు కావడంతో ఆమె టీటీడీకి డిక్లరేషన్ కూడా ఇచ్చారు. హిందూ మతంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీభూవరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. సోమవారం తెల్లవారు జామున స్వామివారిని దర్శించుకున్నారు.
