రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి : సీఎం చంద్రబాబు
పోలీసు సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం పాలన తీరును ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Harishth Thanniru
- Published On : October 21, 2024 / 10:48 AM IST
CM Chandrababu Naidu
Chandrababu Naidu: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, హోంశాఖ మంత్రి అనిత, డీజీపీ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని అన్నారు. ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకం.. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీలేదు. పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: బద్వేల్ బాలిక ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. పోలీసులకు కీలక ఆదేశాలు..
గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం కక్ష సాధింపులే పనిగా పెట్టుకుంది రాగద్వేషాలకు అతీతంగా పనిచేసేదే పోలీసు వ్యవస్థ అని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లో పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ చెల్లించాం. దిశ పేరుతో వాహనాలకు రూ. 16కోట్లు, కమ్యూనికేషన్ పరికరాలకోసం రూ.20కోట్లు పెండింగ్ పెడితే వాటినీ చెల్లించాం. సర్వే రాళ్లపై బొమ్మ కోసం రూ. 700 కోట్లు తగలేసిన వ్యక్తి జగన్.. సీసీ కెమెరాల కోసం మాత్రం రూ. 700 కోట్లు ఇవ్వలేక పోయారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాల తీరు మారుతోంది.. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి.. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు సూచించారు.
