విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పొలిటికల్ వార్
- bheemraj
- Published On : February 16, 2021 / 03:43 PM IST
Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పొలిటికల్ వార్ ముదురుతోంది. ప్రైవేటీకరణను రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు పొలిటికల్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు ప్రైవేటీకరణ ఆపుతామంటూ కేంద్రం పెద్దలను కలుస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు.. నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రైవేటీకరణను ఆపేందుకు అవసరమైతే పదవుల త్యాగానికైనా సిద్ధమని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాజీనామాలకు వైసీపీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
ఇక వైజాగ్ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేది లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. పల్లా శ్రీనివాస్ దీక్షకు మద్దతుగా చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎల్లుండి రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 20న విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. కార్మికసంఘాల ఆందోళనలకు మద్దతుగా పాదయాత్ర నిర్వహిస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు. త్వరలోనే ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరతామని తెలిపారు. విశాఖ నుంచి ఢిల్లీకి వినపడేలా పాదయాత్ర చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
