Prabha Varupula: వరుపుల రాజా కుటుంబానికి అండగా టీడీపీ.. ప్రత్తిపాడు ఇంఛార్జ్ గా రాజా సతీమణి
Prabha Varupula: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా వరుపుల సత్యప్రభ నియమితులయ్యారు. ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ను సత్యప్రభకు కేటాయిస్తామని జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెలిపారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : March 8, 2023 / 01:05 PM IST
Prabha Varupula: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా వరుపుల సత్యప్రభ నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ బుధవారం వెల్లడించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వరుపుల రాజా మార్చి 4 తేదీన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో ఆయన సతీమణి సత్యప్రభకు ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పింది టీడీపీ అధిష్టానం.
వరుపుల రాజా కుటుంబానికి అండగా ఉంటాం
ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ను సత్యప్రభకు కేటాయిస్తామని జ్యోతుల నవీన్ తెలిపారు. వరుపుల రాజా మృతితో ఆయన స్థానాన్ని సతీమణి సత్యప్రభ భర్తీ చేస్తారని చెప్పారు. ఇప్పటికే చంద్రబాబు దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా వరుపుల రాజా కుటుంబానికి అండగా వుంటామని భరోసాయిచ్చారు. సత్యప్రభను ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిపించి రాజా ఆశయాలను నెరవేరుస్తామని అన్నారు. మార్చి 16న రాజా సంతాప సభ భారీ స్థాయిలో నిర్వహించనున్నట్టు చెప్పారు.
వరుపుల రాజా మరణంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ బలమైన నాయకుడిని కోల్పోయింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే టీడీపీ అధిష్టానం ఆ కుటుంబానికే నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పింది. సత్యప్రభను ఇంఛార్జ్ గా నియమించి తాము ఇప్పటికీ వరుపుల ఫ్యామిలీకి అండగా ఉన్నామనే సంకేతాలు పంపింది. అటు అధికార వైసీపీ కూడా వరుపుల కుటుంబం పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించింది. వరుపుల రాజా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిపించి సాఫ్ట్ కార్నర్ చాటుకుంది.
Also Read: కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన!
