దేశంలో ఫస్ట్ టైమ్..ఏపీకి Rapid Kits : 10 నిమిషాల్లో రిపోర్టు..ఇవి ఎలా పని చేస్తాయో తెలుసా

  • Publish Date - April 18, 2020 / 02:28 AM IST

ఏపీలో కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలోనూ మర్కజ్‌ కనెక్షన్‌తో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మర్కజ్‌ కాంటాక్టు వ్యక్తులు వేలల్లో ఉండడంతో వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం కష్టతరంగా మారింది. రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది నిమిషాల్లోనే కరోనా ఫలితాన్ని తేల్చే ర్యాపిడ్‌ కిట్లను కొనుగోలు చేసింది. దక్షిణా కొరియా నుంచి ఓ లక్ష ర్యాపిడ్‌ కిట్లను కొనుగోలు చేసింది. ఇవి నిన్ననే ప్రత్యేక చార్టర్‌ విమానంలో ఏపీకి చేరుకున్నాయి.

దక్షిణ కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్‌ కిట్లలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఐజీ – జి  అయితే.. మరొకటి ఐజీ -ఎం.  ఈ రెండింటిని ద్వారా ఒక వ్యక్తికి కరోనా సోకిందా లేదా అన్నది నిర్ధారిస్తారు. రెండు కిట్లలోనూ రెండు  స్ట్రిప్స్‌ ఉంటాయి. అనుమానిత వ్యక్తి బ్లడ్‌ డ్రాప్స్‌ను ఈ స్ట్రిప్స్‌పై వేస్తారు. తర్వాత కంట్రోల్‌ సొల్యూషన్‌ వేస్తారు. 10 నిమిషాల తర్వాత వెల్స్‌లో రిపోర్ట్‌ కనిపిస్తుంది. ఐజీ – జీలో నెగటివ్‌ వచ్చి…. ఎజీ- ఎంలో పాజిటివ్‌ వస్తే టెస్ట్‌ చేసిన వ్యక్తికి కరోనా ఉన్నట్టుగా నిర్ధారిస్తారు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్చుతారు. అక్కడ  అతనికి పూర్తిస్థాయి వ్యాధి నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తారు.

ఇక ఐజీ-ఎంలో నెగిటివ్‌ వచ్చి.. ఐజీ – జీలో పాజిటివ్‌ వస్తే అతడికి కరోనా లేదని అర్థం.  ఆ వ్యక్తిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్టు లెక్క.  అతడిలో యాంటీ బాడీ బాగా ఉన్నట్టుగా వైద్యులు భావిస్తారు. వారిని కోవిడ్‌ వారియర్స్‌గా కూడా పిలుస్తారు. అవసరమైతే వారి బ్లడ్‌లోని ప్లాస్మాను కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ఎక్కించి వ్యాధి నయం కావడానికి చర్యలు తీసుకుంటారు.

దక్షిణ కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్‌ కిట్లను ఆస్పత్రుల్లో వినియోగించరు. వీటిని  రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో… కేసులు ఎక్కువగా నమోదవుతున్నా ప్రాంతాల్లో వినియోగిస్తారు. కరోనా బాధితుడు కాంటాక్టు అయిన వారందరిని ఈ ర్యాపిడ్‌ టెస్ట్‌ల ద్వారా పరీక్షిస్తారు. కమ్యూనిటీ టెస్టింగ్‌ కోసం వీటిని వినియోగిస్తారు కాబట్టి వీటిని కమ్యూనిటీ కిట్స్‌గా కూడా పిలుస్తారు. వీటి ద్వారా ఎవరైనా సులువుగా కరోనా టెస్ట్‌లు చేసుకోవచ్చు. షుగర్‌ పేషెంట్లు చేసుకున్నట్టుగానే వీటిని చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు ట్రైనింగ్ ఇచ్చి టెస్ట్‌లు వారితో  చేయించనుంది. 

ర్యాపిడ్‌ కిట్స్‌తో పరీక్షలు 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేయనున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ కోవిడ్‌ ర్యాపిడ్‌ కిట్లను ప్రారంభించారు. వీటిద్వారా తొలి టెస్ట్‌ను సీఎం జగన్‌ చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు జగన్‌కు నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
కొత్తగా లక్ష ర్యాపిట్‌ కిట్లు రావడంతో ఆంధ్రప్రదేశ్‌ కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇన్‌ఫెక్షన్‌ ఉందా లేదా నిర్ధారించడమే కాకుండా.. ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తించనున్నాయి.