summer
Heat Alert: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో మధ్యాహ్నం వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి. శనివారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పల్నాడు జిల్లా రావిపాడులో శనివారం 43డిగ్రీల రికార్డు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 119 ప్రాతాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాక 14 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాలులు వీచాయి. ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇవాళ 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది.
శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాల్లో అదేవిధంగా విజయనగరం-11, మన్యం-10, ఏలూరు-1, ఎన్టీఆర్ జిల్లాలోని ఒక మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. స్థానిక వాతావరణం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడాలని సూచించారు.
APSDMA