Somireddy Chandramohan: మద్యం లంచాల ద్వారా ప్రభుత్వ పెద్దలకు రూ.5000 కోట్లు వస్తున్నాయి: సోమిరెడ్డి
రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల్లో తక్కువ నాణ్యత కలిగిన మద్యం అమ్ముతున్నారని, అవి తాగి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్
- Bharath Reddy
- Published On : March 18, 2022 / 02:41 PM IST
Somi
Somireddy Chandramohan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల్లో తక్కువ నాణ్యత కలిగిన మద్యం అమ్ముతున్నారని, అవి తాగి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నడూ వినని మద్యం బ్రాండ్ లను ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారని..ఆయా బ్రాండుల్లో కనీస నాణ్యత కూడా పాటించడం లేదని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నాణ్యత లేని బ్రాండులను విక్రయించేందుకు గానూ.. ఆయా సంస్థల నుంచి నెలకు రూ.400 కోట్లు లంచాల రూపంలో ప్రభుత్వ పెద్దలకు అందుతున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు. ఏడాదికి సుమారు రూ.5,000 కోట్లు లంచాలుగానే ప్రభుత్వానికి అందుతున్నాయని చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
Also Read: MLA Shakeel : ఆ కారు ఎమ్మెల్యే షకీల్దే ?.. పోలీసుల అనుమానాలు
బ్రాండెడ్ మద్యాన్ని విక్రయించాలంటే ప్రభుత్వానికి లంచాలు చెల్లించి రావడంతో..రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న ఆయా సంస్థలు మూసుకునే పరిస్థితి ఏర్పడిందని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సింగరాయకొండలో మద్యం తయారు చేస్తున్న అంతర్జాతీయ బ్రాండ్ “మెక్ డౌల్స్”.. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఇక్కడి నుంచి తరలివెళ్లిపోయేందుకు సిద్ధపడిందని చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పే ధరకు మద్యం విక్రయించలేని బ్రాండెడ్ సంస్థలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తానికే మద్యం విక్రయాలు నిలిపివేశాయని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
Also Read: Telangana RTC : చిల్లర సమస్యకు పరిష్కారం-ఆర్టీసీ బస్సులో రౌండప్ చార్జీలు అమలు
నాణ్యమైన బ్రాండెడ్ మద్యం దొరక్కపోవడంతో.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరుకుతున్న “చీప్ మద్యాన్ని” తాగి ప్రజలు అనారోగ్యం భారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Also read: Pegasus Spyware : పెగాసస్ సాఫ్ట్వేర్ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు-లోకేష్ నారా
