×
Ad

CM Jagan Visakhapatnam : త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన

ఏపీ పరిపాలన రాజధాని విశాఖపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తారని అన్నారు. సీఎం జగన్ ఎక్కడి

  • Published On : June 3, 2021 / 07:48 AM IST

Cm Jagan Visakhapatnam

CM Jagan Visakhapatnam : ఏపీ పరిపాలన రాజధాని విశాఖపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తారని అన్నారు. సీఎం జగన్ ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. సీఆర్డీఏ చట్టానికి, మూడు రాజధానులకు సంబంధమే లేదన్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తప్పకుండా వస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే దానికి సంబంధించిన డేట్ మాత్రం అడగొద్దన్నారు.

కార్యనిర్వాహక రాజధాని కానున్న విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపట్టిందని విజయసాయిరెడ్డి చెప్పారు. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పరిధుల్లో పలు ప్రాజెక్టులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. విశాఖలో కైలాసగిరి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకూ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన జరుగుతోందన్నారు.

విశాఖ జిల్లాలో కోవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో పాటు జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పరిధుల్లో వివిధ ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు సమీక్షించారు. విశాఖ కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు విజయసాయిరెడ్డి సమాధానమిస్తూ.. కార్యనిర్వాహక రాజధాని అతి త్వరలోనే విశాఖకు వస్తుందని అన్నారు. సీఆర్‌డీఏకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఆ కేసులకు రాజధాని తరలింపునకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. మూడు రాజధానుల అంశంపై స్పందించిన మంత్రి కన్నబాబు.. తప్పకుండా రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటాయని చెప్పారు.