Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్ పున: ప్రారంభం..
ఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో ఉదయం, రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు.
- Harishth Thanniru
- Published On : May 25, 2025 / 08:47 AM IST
Srisailam Temple
Srisailam Temple: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం ఒకటి. కొలిచే వారి కొంగుబంగారం శ్రీశైలం మల్లన్న. నిత్యం భక్తులతో ఈ ప్రాంతం శివనామ స్మరణలతో మారుమోగిపోతుంది. తాజాగా.. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.
ఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో ఉదయం, రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీనికి టికెట్లను ఆన్ లైన్లోనే ఉంచుతున్నారు. అయితే, స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్ను ఆలయ అధికారులు పున: ప్రారంభించారు. తాజా నిర్ణయంతో ఇకపై శని, ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం కూడా భక్తులు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఆ మూడ్రోజులు మధ్యాహ్నం మల్లన్న స్పర్శదర్శనం చేసుకునే వారికి ఆన్ లైన్లో 350 టికెట్లు, కరెంట్ బుకింగ్లో 200 టికెట్లు అందుబాటులో ఉంచారు.
ఆలయ ఈవో శ్రీనివాసరావు ఇటీవల ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ, వసతి విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనం కల్పించేందుకు వైదిక కమిటీ, అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
